మెజారిటీపైనే దృష్టి..! | ysrcp josh in elections | Sakshi
Sakshi News home page

మెజారిటీపైనే దృష్టి..!

May 3 2014 2:47 AM | Updated on Aug 29 2018 8:56 PM

మెజారిటీపైనే దృష్టి..! - Sakshi

మెజారిటీపైనే దృష్టి..!

బొబ్బిలిలో వైఎస్‌ఆర్ సీపీ అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. బొబ్బిలి రాజు ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు ముచ్చటగా మూడోసారి గెలవడానికి సర్వం సిద్ధమైంది.

 బొబ్బిలి, న్యూస్‌లైన్ : బొబ్బిలిలో వైఎస్‌ఆర్ సీపీ అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. బొబ్బిలి రాజు ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు ముచ్చటగా మూడోసారి గెలవడానికి సర్వం సిద్ధమైంది. అయితే మేం కూడా గెలుస్తామంటూ టీడీపీ, కాంగ్రెస్‌లు బీరాలు పలుకుతున్నా అవి ఉత్త మాటలేనని ప్రజలు తీసిపారేస్తున్నారు. 2004, 2009లో సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సుజయ్‌పై టీడీపీలో ఉంటూ పోటీ చేసిన శంబంగి ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి తెంటు లక్ష్ముంనాయుడు పోటీలో ఉన్నారు.

ఇంతకుముందు ఈయన సుజయ్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు.  వైఎస్‌ఆర్ సీపీ బలం ముందు టీడీపీ తేలిపోతోందని ప్రజలు భావిస్తున్నారు. బొబ్బిలి రాజులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అధిక సంఖ్యలో ప్రజలు వారి వెంటే నడిచారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ ఈ విషయం రుజువైంది. అప్పట్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుమ్మక్కైనా రాజులను ఎదిరించలేకపోయారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ కి అత్యధిక మెజారిటీ తెచ్చుకోవాలని సుజయ్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే హోరుగా ప్రచారం చేస్తున్నారు.  
 
 టీడీపీకి ముచ్చెమటలు
 నియోజకవర్గంలో టీడీపీ విజయం ఖాయమైపోయిందం టూ ఒక పక్క ఆ పార్టీ నాయకులు బీరాలు పలుకుతున్నా, మరో వైపు వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. కొందరు నాయకులు కలిసినా, కార్యకర్తలు వారివెంట ఉన్నారా, మనస్ఫూర్తిగా పనిచేస్తారా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  
 
 చతికిలపడిన కాంగ్రెస్
 మొన్న పంచాయతీ, నిన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో పూర్తిగా చతికిలపడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సార్వత్రిక పోటీలో నిలబడింది. అధికార పార్టీని నమ్ముకొని ఆ పార్టీలోకి వచ్చిన శంబంగినే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థిగా ముందే ఖరారు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాడంగి, రామభద్రపురం నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోవడంతో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను కూడా పెట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొంది.
 
 ఈ పరిస్థితుల్లో శంబంగి ఎమ్మెల్యే ఎన్నికల బరిలో దిగేందుకు సాహసించారు. ఎన్నికలప్పుడు బీసీ నినాదం పెట్టి బొబ్బిలి రాజులను ఎదుర్కొందామనుకొనే నాయకులు ఈ సారి బీసీ నినాదాన్ని పక్కన పెట్టేశారు. టీడీపీ, కాంగ్రెస్, జై సమైక్యాంధ్రా పార్టీకి చెందిన అభ్యర్థులంతా కొప్పలవెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ నినాదం వైపు ఎవ్వరూ వెళ్లడం లేదు. ఎవరు ఈ నినాదం ఎత్తితే ఎవరి ఓట్లకు ఎసరు తగులుతుందోనని భయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement