
ఇదిగో టీడీపీ చీకటి బాగోతం
తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో మద్యం పరవళ్లు తొక్కించడానికి గాను టెక్కలి నడిబొడ్డున ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై సోమవారం ‘సాక్షి’
టెక్కలి, న్యూస్లైన్: తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో మద్యం పరవళ్లు తొక్కించడానికి గాను టెక్కలి నడిబొడ్డున ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై సోమవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన ‘మందుబాబాలు’, ‘వాట్ యాన్ ఐడియా అచ్చెన్నా’ అనే కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. ఉరుకులు పరుగులు పెడుతూ దుకాణంపై అధికారులు తనిఖీలు చేశారు. అయితే తీరా అక్కడికెళ్లిన అధికారులు నిర్వాహకులు తీరు చూసి ఆశ్చర్యపోయారు. దుకాణం బయట తాళాలు వేసి పర్మిట్రూమ్ నుంచి టీడీపీ నాయకులు మద్యం తరలించడం చూసి నివ్వెరపోయారు. అయితే వారిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించాల్సిందిపోయి విడిచిపెట్టడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... టెక్కలి పాత జాతీయ రహదారికి ఆనుకని భైరివీధి జంక్షన్లో ఇటీవల ఏర్పాటు చేసిన సప్తగిరి వైన్స్పై ఆర్డీఓ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ టెక్కలి ఎస్సై కె.వి.రమణతో పాటు సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, ఏఎస్ఓ మురళీకృష్ణ తదితరులు మెరుపు సోదాలు చేపట్టారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న తెలుగు తమ్ముళ్లు దుకాణం నుంచి కొంత మద్యాన్ని తరలించేశారు. పర్మిట్రూం తాళాలు పగలగొట్టగా, అందులో టీడీపీ చెందిన కీలక కార్యకర్తలంతా దర్శనమిచ్చారు. పర్మిట్రూమ్లో గోనె సంచుల్లో మద్యం బాటిళ్లు ఉన్నప్పటికీ, సోదా చేయకుండా ఎక్సైజ్ అధికారులు యజమానిని రక్షించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న విలేకరులు, స్థానికులు గోనె సంచులను తనిఖీ చేయాలని పట్టుపట్టినప్పటికీ ఎస్సై కె.వి.రమణ అవి ఖాళీ మద్యం సీసాలని చెబుతూ సప్తగిరి వైన్స్ను మూసివేయించి తాళాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ ఎస్సై తీరుపై ఆర్డీవో మండిపాటు..
టెక్కలి సప్తగిరి వైన్స్లో సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులు ఆర్డీఓ ఎ.శ్యామ్ప్రసాద్కు కట్టు కథలు చెప్పడంతో, అనుమానం వచ్చిన ఆర్డీఓ శ్యామ్ప్రసాద్ పూర్తి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. అవి ఖాళీ సీసాలని ఎస్సై కె.వి.రమణ నమ్మించి ప్రయత్నం చేసినా చివరకు ఆయనే రంగప్రవేశం చేశారు. తహశీల్దార్ ఆర్.అప్పలరాజుతోపాటు సప్తగిరి వైన్స్ వద్దకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. ఎక్సైజ్ సీఐ విజయకుమార్తో పాటు ఎస్సై రమణను అక్కడకు రావాలని ఆదేశించారు. ఖాళీ బాటిళ్లు అని చెప్పిన సదరు గోనె సంచులు తరలింపునకు సిద్ధంగా ఉండటం చూపించి చీవాట్లు పెట్టారు. అరకొర తనిఖీలు చేయవద్దని హితవు పలికారు. దుకాణాల్లో ఏ చిన్న అనుమానం కలిగినా సీజ్ చేసి కేసు నమోదు చేయాలని ఆర్డీఓ శ్యామ్ప్రసాద్ ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.