నేరుగా ఓటర్‌కే స్లిప్పులు | straight for voter slips | Sakshi
Sakshi News home page

నేరుగా ఓటర్‌కే స్లిప్పులు

Apr 22 2014 4:04 AM | Updated on Mar 21 2019 8:35 PM

కొత్తగా జారీచేసిన స్లిప్పులను బూత్‌లెవల్‌లో నేరుగా ఓటర్ ఇంటికెళ్లి వారికే అందజేయాలని..

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: కొత్తగా జారీచేసిన స్లిప్పులను బూత్‌లెవల్‌లో నేరుగా ఓటర్ ఇంటికెళ్లి వారికే అందజేయాలని, లేనిపక్షంలో సంబంధిత వారిపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ హెచ్చరించారు. సోమవారం రాత్రి ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మునిసిపల్, స్థానిక ఎన్నికల్లో మీ నిర్లక్ష్యం కారణంగా 50 శాతం కూడా ఓటర్ స్లిప్పులు అందలేదన్నారు. పైగా బూత్ పరిధిలోని ఓ నాయకుడికి వాటిని అప్పగించడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయని, ఈ సందర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ఓటింగ్‌శాతం పెంచేందుకే..
 ప్రతిసారి ఎన్నికల్లో గుర్తింపు కార్డుల్లేని కారణంగా ఓటింగ్‌శాతం తగ్గుతుందనే కారణంతో ఈసారి ఓటర్‌స్లిప్పులను గుర్తింపుకార్డులుగా పరిగణించారని అన్నారు. పంపిణీ కాని ఓటరు చీటీల కోసం ఈనెల 29, 30న సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేసి పంపిణీ చేయాలని సూచించారు.
 
 గైర్హాజరైతే క్షమించం
 మొదటిరోజు అన్ని నియోజకవర్గాల్లో ఇచ్చిన శిక్షణకు 10శాతం సిబ్బంది గైర్హాజరయ్యారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమన్నారు. ఎన్నికల సిబ్బంది డిఆర్వో అనుమతితోనే వెళ్లాలని, అలా కాకుండా గైర్హాజరైతే ఎన్నికల నిబంధనల ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మన్, డీఆర్వో రాంకిషన్, డ్వామా పీడీ హరితతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement