బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గంటపాటు సుదీర్ఘంగా సమావేశమైయ్యారు.
ఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గంటపాటు సుదీర్ఘంగా సమావేశమైయ్యారు. మరికొద్ది రోజుల్లో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర కేబినెట్ కు సంబంధించిన అంశాలపై అద్వానీతో మోడీ చర్చించారు. ఇప్పటికే అద్వానీని లోక్ సభ స్పీకర్ గా నియమించాలని బీజేపీ యోచిస్తోంది. ఒకవేళ అద్వానీకి ఆ పదవి దక్కితే మూడో అత్యుత్తమ పదవి ఆయనదే అవుతుంది. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి పదవుల తర్వాత లోక్ సభ స్పీకర్ దే అత్యంత ప్రాధాన్యమున్న పదవి.
మరో బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడుతో పాటు, అరుణ్ జైట్లీ, జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లకు కీలక పదవుల దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, షాన్ వాజ్ హుస్సేన్ తో పాటు ఆమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ దిగి ఓడిపోయిన స్మృతీ ఇరానీకి కూడా కేబినెట్ లో చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. తిరిగి పార్టీ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు అటు మోడీతో పాటు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఆదివారం రామ్ విలాస్ పాశ్వాన్ కు మోడీని కలిసి కేబినెట్ లో చోటు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.