సీట్లు సైకిల్‌కి.. ఓట్లు ఫ్యాన్‌కి | More Municipal seats to TDP, but Votes to Ysr congress party | Sakshi
Sakshi News home page

సీట్లు సైకిల్‌కి.. ఓట్లు ఫ్యాన్‌కి

May 13 2014 3:22 AM | Updated on May 25 2018 9:17 PM

సీట్లు సైకిల్‌కి.. ఓట్లు ఫ్యాన్‌కి - Sakshi

సీట్లు సైకిల్‌కి.. ఓట్లు ఫ్యాన్‌కి

సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ పలుచోట్ల గెలిచి ఓడింది.

* టీడీపీ గెల్చుకున్న మునిసిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీకి ఓట్ల మెజారిటీ
ఈ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య తేడా కేవలం 1,55,211 ఓట్లు మాత్రమే
మునిసిపాలిటీల్లో టీడీపీకి 45.18 %, వైఎస్సార్‌సీపీకి 40.54 శాతం ఓట్లు
కార్పొరేషన్లలో టీడీపీకి 40.04 %, వైఎస్సార్‌సీపీకి 34.82 శాతం ఓట్లు

 

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ పలుచోట్ల గెలిచి ఓడింది. మునిసిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్యా పరంగా టీడీపీ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ ఆ మునిసిపల్ పరిధిలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల సంఖ్య కన్నా తక్కువగానే ఉంది. సీమాంధ్రలోని మొత్తం 92 మునిసిపాలిటీల్లో కలిపి టీడీపీకి వచ్చిన ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా కేవలం 1,55,211 మాత్రమే ఎక్కువ.
 
 ఈ సంఖ్య ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పోలయ్యే ఓట్ల సంఖ్య కన్నా తక్కువ. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, బద్వేల్ మునిసిపాలిటీల్లో టీడీపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఓట్లపరంగా మాత్రం మైదుకూరు మొత్తం మునిసిపాలిటీ పరిధిలో టీడీపీ కన్నా ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2,188 ఓట్లు అదనంగా వచ్చాయి. బద్వేలు మునిసిపాలిటీలో మొత్తం 26 వార్డులకు గాను 21 వార్డులను టీడీపీ గెలుచుకున్నప్పటికీ, ఓట్ల పరంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీ దక్కింది.
 
  ఆ మునిసిపాలిటీ పరిధి మొత్తంలో టీడీపీకి 15,814 మాత్రమే ఓట్లు రాగా.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 21,010 ఓట్లు వచ్చాయి. గుంటూరు జిల్లా వినుకొండ మునిసిపాలిటీలోనూ టీడీపీ కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3,864 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇక టీడీపీ గెలుచుకున్న తిరువూరు, ఉయ్యూరు, ఏలేశ్వరం, చీమకుర్తి, జమ్ములమడుగు, బాపట్ల మునిసిపాలిటీల్లో మొత్తంగా ఆ పార్టీ వెయ్యి లోపు ఓట్లు మాత్రమే అదనంగా తెచ్చుకోగలిగింది. బాపట్లలో కేవలం రెండు ఓట్లు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా టీడీపీకి అధికంగా వచ్చాయి. మొత్తం 92 మునిసిపాలిటీలు, 7 నగర పాలక సంస్థల పరంగా చూసినా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది.
  92 మునిసిపాలిటీల్లో మొత్తం 33,49,076 ఓట్లు పోలవగా టీడీపీ 15,13,195 ఓట్లు దక్కించుకోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పోటాపోటీగా 13,57,197 ఓట్లు తెచ్చుకుంది. మొత్తం మీద.. పురపాలక సంఘాల్లో టీడీపీకి 45.18 శాతం ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 40.54 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 4.64 శాతం మాత్రమే. అలాగే.. నగరపాలక సంస్థల్లో టీడీపీకి 40.04 శాతం ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 34.82 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ తేడా 5.22 శాతం మాత్రమే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement