Seemandhra Municipal Elections
-
సీట్లు సైకిల్కి.. ఓట్లు ఫ్యాన్కి
* టీడీపీ గెల్చుకున్న మునిసిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీకి ఓట్ల మెజారిటీ * ఈ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య తేడా కేవలం 1,55,211 ఓట్లు మాత్రమే * మునిసిపాలిటీల్లో టీడీపీకి 45.18 %, వైఎస్సార్సీపీకి 40.54 శాతం ఓట్లు * కార్పొరేషన్లలో టీడీపీకి 40.04 %, వైఎస్సార్సీపీకి 34.82 శాతం ఓట్లు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ పలుచోట్ల గెలిచి ఓడింది. మునిసిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్యా పరంగా టీడీపీ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ ఆ మునిసిపల్ పరిధిలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల సంఖ్య కన్నా తక్కువగానే ఉంది. సీమాంధ్రలోని మొత్తం 92 మునిసిపాలిటీల్లో కలిపి టీడీపీకి వచ్చిన ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా కేవలం 1,55,211 మాత్రమే ఎక్కువ. ఈ సంఖ్య ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పోలయ్యే ఓట్ల సంఖ్య కన్నా తక్కువ. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, బద్వేల్ మునిసిపాలిటీల్లో టీడీపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఓట్లపరంగా మాత్రం మైదుకూరు మొత్తం మునిసిపాలిటీ పరిధిలో టీడీపీ కన్నా ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2,188 ఓట్లు అదనంగా వచ్చాయి. బద్వేలు మునిసిపాలిటీలో మొత్తం 26 వార్డులకు గాను 21 వార్డులను టీడీపీ గెలుచుకున్నప్పటికీ, ఓట్ల పరంగా వైఎస్సార్ కాంగ్రెస్కు తిరుగులేని మెజారిటీ దక్కింది. ఆ మునిసిపాలిటీ పరిధి మొత్తంలో టీడీపీకి 15,814 మాత్రమే ఓట్లు రాగా.. వైఎస్సార్ కాంగ్రెస్కు 21,010 ఓట్లు వచ్చాయి. గుంటూరు జిల్లా వినుకొండ మునిసిపాలిటీలోనూ టీడీపీ కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3,864 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇక టీడీపీ గెలుచుకున్న తిరువూరు, ఉయ్యూరు, ఏలేశ్వరం, చీమకుర్తి, జమ్ములమడుగు, బాపట్ల మునిసిపాలిటీల్లో మొత్తంగా ఆ పార్టీ వెయ్యి లోపు ఓట్లు మాత్రమే అదనంగా తెచ్చుకోగలిగింది. బాపట్లలో కేవలం రెండు ఓట్లు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా టీడీపీకి అధికంగా వచ్చాయి. మొత్తం 92 మునిసిపాలిటీలు, 7 నగర పాలక సంస్థల పరంగా చూసినా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. 92 మునిసిపాలిటీల్లో మొత్తం 33,49,076 ఓట్లు పోలవగా టీడీపీ 15,13,195 ఓట్లు దక్కించుకోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పోటాపోటీగా 13,57,197 ఓట్లు తెచ్చుకుంది. మొత్తం మీద.. పురపాలక సంఘాల్లో టీడీపీకి 45.18 శాతం ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్కు 40.54 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 4.64 శాతం మాత్రమే. అలాగే.. నగరపాలక సంస్థల్లో టీడీపీకి 40.04 శాతం ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్కు 34.82 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ తేడా 5.22 శాతం మాత్రమే ఉంది. -
ఓటింగ్లో సత్తా చాటిన ఫ్యాన్
సాక్షి, గుంటూరు :పుర ఫలితాల్లో సీట్ల పరంగా ఆధిక్యం కనబర్చకపోయినా ఓట్ల విషయంలో వైఎస్సార్ సీసీ హవా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం విడుదలైన మున్సిపోల్స్ ఫలితాల్లో టీడీపీ స్వల్ప ఆధిక్యతతోనే అధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 12 మున్సిపాలిటీల్లో 11 స్థానాలు టీడీపీ కైవసం చేసుకున్నప్పటికీ ఆ స్థాయిలో ఓట్లను మాత్రం పొందలేకపోయింది. ఇరు పార్టీలకు మున్సిపాలిటీల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే పట్టణ ఓటర్లు కూడా వైఎస్సార్ సీపీని ఆదరించినట్లు స్పష్టమవుతోంది. తాడేపల్లిలో ఫ్యాన్ హవా సుస్ఫష్టం.. తాడేపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు 18 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా, టీడీపీ మూడింటికే పరిమితమైంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ 6163 ఓట్ల ఆధిక్యాన్ని సాధించగిలిగింది. బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ళ, నరసరావుపేట, చిలకలూరిపేట, రేపల్లె, మున్సిపాలిటీలను టీడీపీ గెలుచుకున్నప్పటికీ స్వల్ప మెజార్టీలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. సత్తెనపల్లిలో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. అక్కడ టీడీపీ 15 వార్డులు సొంతం చేసుకోగా, వైఎస్సార్సీపీ 13 వార్డుల్లో విజయం సాధించింది. మిగతా రెండు వార్డుల్లో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు గెలవగలిగారు. ఇక్కడ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వార్డులు గెలిచినా ఓట్లు దక్కించుకోలేని టీడీపీ బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు ఉండగా 19 టీడీపీ, 13 వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్నాయి. ఆరు వార్డులు అధికంగా గెలుచుకున్నప్పటికీ మొత్తం మీద వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి రెండు ఓట్లు మాత్రమే ఎక్కువ రావడం గమనార్హం. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 29 వార్డులు ఉండగా, ఎనిమిది వైఎస్సార్సీపీ, 20 వార్డులు టీడీపీ సొంతం చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ కంటే 12 వార్డులు అధికంగా గెల్చినా కేవలం 1600 ఓట్లు మెజార్టీ మాత్రమే సాధించగలిగింది. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా, 18 టీడీపీ, 12 వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. వైఎస్సార్ సీపీ కంటే ఆరు వార్డులను అధికంగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందినా కేవలం 1900 ఓట్ల మెజార్టీ సాధించగలిగారు. ఇలా అధిక శాతం మున్సిపాలిటీల్లో 2వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకున్నాయి. ఫలితాల్లో వెల్లడయిన కుట్రలు.. సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించిన వైఎస్సార్ సీపీ ఒక్కసారిగా వచ్చిపడిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించడంలో కొంత తడబడింది. ఆది నుంచి మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమైన టీడీపీ ఈ ఎన్నికల్లో స్వల్పంగా మెజార్టీ పొందగలిగింది. తాము గెలిచిన చోట కూడా వైఎస్సార్ సీపీ గణనీయంగా ఓట్లు సాధించడం టీ డీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి వైఎస్సార్ సీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కుట్రలు పన్నిన వైనం ఫలితాల్లో వెల్లడయింది. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న వార్డుల్లో కాంగ్రెస్ పోటీ చేసి ఓట్లను చీల్చడం ద్వారా టీడీపీకి లబ్ధిచేకూర్చింది. అదేవిధంగా టీడీపీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుని కుమ్మక్కు కుట్రలకు తెరలేపింది. సోమవారం వెల్లడయిన మున్సిపల్ ఫలితాలను చూసిన రాజకీయ విశ్లేషకులు పట్టణ ప్రాంతాల్లో ఉండే స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఎంపికపై గెలుపోటములు ఉంటాయని, వీటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేస్తున్నారు.


