ప్రాదేశిక పోరు ముగిసంది | local body elections ended | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక పోరు ముగిసంది

Apr 11 2014 11:32 PM | Updated on Mar 28 2018 10:59 AM

ప్రాదేశిక పోరు ముగిసంది. దాదాపు నెలరోజులుగా పల్లెల్లో కొనసాగిన హడావుడికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  ప్రాదేశిక పోరు ముగిసంది. దాదాపు నెలరోజులుగా పల్లెల్లో కొనసాగిన హడావుడికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. తొలివిడతలో 16 మం డలాల్లో ప్రాదేశిక ఎన్నికలు పూ ర్తికాగా, మలివిడతలో 17 మండలాల్లో ఎన్నికలు ప్రశాం తంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం జరిగిన మలివిడత ప్రాదేశిక పోరులో 17 జెడ్పీటీసీ, 311 ఎంపీటీసీ      స్థానాలకు అధికారులు పోలింగ్ నిర్వహించగా ఓటర్లు ఉత్సాహంతో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,71,463 మంది ఓటర్లకు 6,16,399 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 79.9% పోలింగ్ నమోదైంది.

 ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ఉత్సాహం చూపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరిగింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తొలి రెండు గంటల్లో ఏకంగా 17.8% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 గంటల సమయంలో 34.82% మంది ఓట్లు వేశారు. అనంతరం ఓటర్ల తాకిడి మరింత పెరిగింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పోలింగ్ 54.76 శాతానికి చేరింది. ఎండ తీవ్రత పెరగడం ఓటింగ్‌పై ప్రభావం చూపింది. దీంతో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో పోలింగ్ మందగించి 66.46శాతానికి చేరింది. సాయంత్రం పోలింగ్ ముగిసేనాటికి 79.9 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అధికంగా కందుకూరు మండలంలో 91.1% ఓట్లు పోలవగా, అత్యల్పంగా సరూర్‌నగర్ మండలంలో 46.05% పోలింగ్ నమోదైంది.

 నెల తర్వాతే ఫలితాలు
 ప్రాదేశిక సమరం ముగిసినప్పటికీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని న్యాయస్థానం ఆదేశాలున్న సంగతి తెలిసిందే. దీంతో గెలుపోటములు తెలుసుకోవాలంటే నెలరోజులు ఆగాల్సిందే. గెలుపోటములపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నప్పటికీ.. ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement