
బాబు ‘కొత్త’ జపం.. బీసీలకు ‘కోత’ నిజం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుపై ఉభయ గోదావరి జిల్లాల్లోని శెట్టిబలిజ సామాజికవర్గం గుర్రుగా ఉంది. సీట్ల కేటాయింపులో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఇప్పుడున్న సీట్లలోనే కోత పెట్టడంపై వారు రగిలిపోతున్నారు.
టీడీపీ అధినేత తీరుపై గుర్రుగా శెట్టి బలిజలు
‘తూర్పు’లో ఒక సీటుకే పరిమితం చేసిన వైనం
బలం ఉన్న నియోజకవర్గాల్లో సైతం దక్కని అవకాశం
కొత్తగా పార్టీలోకి వస్తున్న వారిపైనే మోజు
పశ్చిమగోదావరిలోనూ ఇదే తరహా రాజకీయం
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుపై ఉభయ గోదావరి జిల్లాల్లోని శెట్టిబలిజ సామాజికవర్గం గుర్రుగా ఉంది. సీట్ల కేటాయింపులో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఇప్పుడున్న సీట్లలోనే కోత పెట్టడంపై వారు రగిలిపోతున్నారు. బీసీల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్నా.. చంద్రబాబు మొండిచేయి చూపుతున్నారని శెట్టిబలిజ నాయకులు మండిపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంటు స్థానాలున్నాయి. అత్యధికంగా 19 నియోజకవర్గాలు ఉన్న తూర్పుగోదావరిలో ఇప్పుడు బీసీలకున్న సీట్లకే కోతపెట్టి ఉన్నత వర్గాలకు కట్టబెడుతున్న బాబు తీరుపై వారు అంతర్మథనం చెందుతున్నారు.
శెట్టిబలిజ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న తూర్పుగోదావరిలో ఒక స్థానానికే పరిమితం చేస్తున్న తీరుపై ఆ వర్గం నిప్పులు చెరుగుతోంది. బీసీలకు పెద్దపీట వేస్తామని వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న చంద్రబాబు ఆచరణకు వచ్చేసరికి తూర్పుగోదావరిలో కాకినాడ రూరల్ సీటుకే పరిమితం చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మె ల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్తిబాబును ఖాయం చేసిన చంద్రబాబు మరో రెండు సీట్లు ఇచ్చే అవకాశమున్నా తమకు కా కుండా లాగేసుకున్నారని ఆ వర్గం నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో శెట్టిబలిజ సామాజికవర్గ ఓటు బ్యాంకు గణనీయమైన సంఖ్యలోనే ఉంది. టీడీపీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులెదురైనా పోటీచేసి ఓటమిపాలైన అతనిని కరివేపాకులా వాడుకుని వదిలేశారని ఆ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హఠాత్తుగా ఉన్నత వర్గానికి చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును పార్టీలోకి చేర్చుకుని టికెట్టు ఖాయం చేయడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడలేక సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ సామాజికవర్గం బలంగా ఉన్న మరో నియోజకవర్గం రామచంద్రపురం. అక్కడి నుంచి టికెట్ ఆశించిన అదే సామాజివర్గానికి చెందిన కట్టా సూర్యనారాయణ, కొప్పిశెట్టి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే మేడిశెట్టి వీరభద్రరావులను కాదన్నారు.
ఒకప్పుడు టీడీపీని కాలదన్ని వెళ్లిపోయిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును తిరిగి టీడీపీలో చేర్చుకుని టికెట్ ఖాయంచేయడాన్ని ఆ వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానాన్ని శెట్టిబలిజ సామాజివర్గానికి చెందిన వాసంశెట్టి సత్యకు ఇవ్వగా ఈసారి ఆ సీటు కూడా వారికి కాకుండా చేశారు. శెట్టిబలిజలను పక్కనబెట్టి పార్టీలోకి వచ్చీ రాగానే ఉన్నత వర్గానికి చెందిన మాజీమంత్రి తోట నరసింహంకు కట్టబెట్టడం తమను అణగదొక్కడానికేననే అభిప్రాయం బీసీల నుంచి వ్యక్తమవుతోంది. తుని టికెట్ యాదవ సామాజికవర్గానికి, రాజమండ్రి రూరల్ టిక్కెట్ చేనేత వర్గానికి ఇస్తున్నామని చెబుతున్న బాబు బలమైన తమ వర్గానికి ఒక్కటితోనే సరిపెడతారా అని వారు ప్రశ్నిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో కూడా టీడీపీలో దాదాపు ఇదే పరిస్థితి కన్పిస్తోంది. అక్కడున్న 15 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఆచంట ఒక్కటే శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన గుబ్బల తమ్మయ్యకు ఇచ్చే ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఇదే కారణంతో ఆయనకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే.. మాజీమంత్రి పితాని సత్యనారాయణ టీడీపీలోకి వస్తే ఈ సీటు ఆయనకు కట్టబెట్టాలనుకుంటున్నారనే ప్రచారం పార్టీలో ఉంది. బీసీలు గణనీయంగా ఉన్న ఆచంటతో పాటు దెందులూరు, పాలకొల్లు స్థానాలు తమకు కేటాయించాలని ఆ సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ఆచంటకే తమను పరిమితం చేసే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా కన్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శెట్టిబలిజ సామాజికవర్గానికి రెండు జిల్లాలకు రెండు మంత్రి పదవులు (పిల్లి సుభాష్చంద్రబోస్, పితాని సత్యనారాయణ)లకు ఇచ్చి ఆ వర్గానికి సముచిత స్థానం కల్పించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
అదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉభయగోదావరి జిల్లాల నుంచి ఆ వర్గానికి చెందిన మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీలు పదవులతో సముచిత స్థానం కల్పించారు. ఉభయగోదావరి జిల్లాల్లో అదే రీతిలో బీసీలకు సముచిత రీతిలో అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. కానీ బీసీల పార్టీగా చెప్పుకుంటోన్న బాబు మాత్రం తమకు దక్కాల్సిన సీట్లకు కోతపెడుతున్నారని ఆగ్రహంతో ఉన్న ఆ వర్గం వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటోంది. రాజమండ్రిలో బీసీ గర్జన అంటూ పార్టీరహితంగా బీసీలను ఒక వేదికపైకి తీసుకువచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ఇటీవల టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి సముచిత స్థాయిలో సీట్లు సాధించే దిశగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.