పరిశ్రమలకు 24 గంటల సెలవు ప్రకటించాలి | Industries should be closed for 24 hours | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు 24 గంటల సెలవు ప్రకటించాలి

Apr 30 2014 12:29 AM | Updated on Sep 2 2017 6:42 AM

సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల రోజున అన్ని షిఫ్ట్‌లకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని సదాశివపేటకు చెందిన ఎంఆర్‌ఎఫ్ కార్మికులు కోరారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్:  సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల రోజున అన్ని షిఫ్ట్‌లకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని సదాశివపేటకు చెందిన ఎంఆర్‌ఎఫ్ కార్మికులు కోరారు. మంగళవారం వారు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఉల్లంఘించిన పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జేసీ శరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జిల్లాలోని ఎంఆర్‌ఎఫ్, తొషిబా, కిర్బీ, పెన్నార్ పరిశ్రమలు 24 గంటల సెలవును ప్రకటించలేదన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని షిఫ్ట్‌లకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించిన విషయాన్ని వారు అధికారుల దృష్టికి తెచ్చారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యాలు 24 గంటలు సెలవు ప్రకటించగా కార్మికులు ఎక్కువగా ఉన్న ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో నైట్‌షిఫ్ట్ నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుని తిరిగి విధులకు ఎలా హాజరవుతామని వారు పేర్కొన్నారు.

 బుధవారం కార్మికులంతా ఓటు వేసేందుకు వీలుగా అన్ని షిఫ్ట్‌ల్లో 24 గంటల పని, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చినట్టు కార్మికులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ లేబర్ కమిషనర్ కోటేశ్వర్‌రావు, ఎంఆర్‌ఎఫ్, తొషిబా, కిర్బీ తదితర పరిశ్రమలకు ఉత్తర్వులు జారీ చేశారని వారు పేర్కొన్నారు. ఆదేశాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించినట్టు వారు తెలిపారు. జేసీని కలిసిన వారిలో సీఐటీయూ ఇండస్ట్రీయల్ జిల్లా కార్యదర్శి మాణిక్యం, నాయకులు సంతోష్‌కుమార్, హరికృష్ణ, శ్రీకాంత్, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారావు, ఆయా పరిశ్రమల కార్మికులు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement