ఒడిశా తొలి దశ ఎన్నికల్లో 103 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
భువనేశ్వర్(పిటిఐ): ఒడిశా తొలి దశ ఎన్నికల్లో 103 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 70 శాసనసభ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరుగనుంది. మొత్తం 673 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 103 (15శాతం) మంది కోటీశ్వరులేనని నేషనల్ ఎలక్షన్వాచ్ అనే సంస్థ వెల్లడించింది.
రూర్కెలా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యాపారవేత్త దిలీప్రే రూ. 106 కోట్ల ఆస్తులతో మిగతా కోటీశ్వరుల కంటే ముందంజలో ఉన్నారు. అధికార బీజేడీ నుంచి 34 మంది, కాంగ్రెస్ తరపున 26 మంది, బీజేపీ నుంచి 19 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఐదుగురు కోటీశ్వరులు పోటీలో నిలిచారు.
ఇదిలా ఉండగా, లక్ష రూపాయల లోపు ఆస్తులు ఉన్నవారు 104 మంది ఉండగా, అసలు ఆస్తులు ఏమీ లేనివారు ఎనిమిది మంది ఉన్నట్లు ఎలక్షన్వాచ్ పేర్కొంది.