దేశం కోటకు బీటలు
అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినాయకత్వం తీరుపై కేడర్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఆపార్టీకి కంచుకోట అయిన మర్రిపూడిలో పలువురు సీనియర్ నేతలు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
-
టీడీపీ కంచుకోట మర్రిపూడిలో షాక్
-
అధినాయకత్వంపై అసంతృప్తి ∙
-
నేడు వైఎస్సార్ సీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేతలు
అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినాయకత్వం తీరుపై కేడర్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఆపార్టీకి కంచుకోట అయిన మర్రిపూడిలో పలువురు సీనియర్ నేతలు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
సాక్షిప్రతినిధి, కాకినాడ :
అనపర్తి నియోజకవర్గంలోని రంగంపేట మండలం మర్రిపూడి గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇంత వరకూ ఆగ్రామంలో మరో పార్టీ జెండా ఎగరలేదు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇతర నేతల ఒంటెద్దు పోకడలతో గ్రామంలోని పలువురు సీనియర్ నేతల్లోæఅసంతృప్తి పెరిగిపోయింది. 2,700 పైచిలుకు ఓట్లు ఉన్న మర్రిపూడి టీడీపీకే మెజార్టీని కట్టబెడుతూ వస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డిపై అప్పటి కాంగ్రెస్పార్టీ అభ్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి 33 వేల ఓట్లు పైచిలుకు భారీ మెజార్టీతో గెలుపొందినప్పుడు మర్రిపూడిలో మాత్రం టీడీపీకే మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారు. ఆ ఓట్లలో కూడా మర్రిపూడిలోనే దాదాపు 416 ఓట్లు మెజార్టీ వచ్చింది. అటువంటి మర్రిపూడి గ్రామంలోని సీనియర్ నేతలు ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలను సైతం వారు మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎమ్మెల్యే తీరు నచ్చక సీనియర్లందరూ కలిసి మరో వర్గంగా ఏర్పడి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేకు పోటీగా విద్యా కమిటీ ఎన్నికల్లో తమకు కావాల్సిన వారినే సీనియర్ల వర్గం పట్టుబట్టి మరీ గెలిపించుకుంది. ఇంత జరిగినా పార్టీ అధిష్టానం తీరులో మార్పు రాకపోవడంతో వారిలో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ విధానాలపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకత, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పట్ల ఆకర్షితులైన ఆ సీనియర్లందరూ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ నాయకులు రిమ్మలపూడి వెంకటేశ్వరరావు(అబ్బు), మాజీ సర్పంచ్ రిమ్మలపూడి కృష్ణమూర్తి, విద్యా కమిటీ చైర్మన్ వేగి రాంబాబు, పిల్లి తాతారావు, మాజీ ఉపసర్పంచ్ మోతుపూరి బంగ్రారాజు, ఎంపీటీసీ మాజీ సభ్యలు పెంకే శ్రీనివాసరావు, మందపల్లి ఏసు, పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు టి. గోపాలకృష్ణ, కాకతీయ, కాపునాడు, ఎమ్మార్పీఎస్, అల్లూరి సీతారామరాజు తదితర సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సమక్షంలో ఆదివారం మర్రిపూడి వినాయకవీధిలో జరిగే కార్యక్రమంలో వారందరూ పార్టీలో చేరనున్నారు.