మల్లన్న సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
శ్రావణమాసం సందర్భంగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు.
శ్రీశైలం: శ్రావణమాసం సందర్భంగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, ఈఓ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేశారు. గవర్నర్ వెంట డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికష్ణ తదితరులు ఉన్నారు.