పుప్పాలగూడ సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీస్‌ | Show Cause notice to puppalguda sarpanch | Sakshi
Sakshi News home page

పుప్పాలగూడ సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీస్‌

Feb 17 2018 9:30 AM | Updated on Sep 15 2018 2:28 PM

Show Cause notice to puppalguda sarpanch - Sakshi

సునీతరాజ్‌కుమార్‌

రాజేంద్రనగర్‌: విధుల దుర్వినియోగంతో పాటు ప్రజలు పన్నుల రూపంలో గ్రామపంచాయతీకి చెల్లించిన డబ్బుతో పాటు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను దుర్వినియోగం చేసిన పుప్పాలగూడ గ్రామ సర్పంచ్‌ ఎం.సునీతారాజ్‌కుమార్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. రూ.4.43కోట్ల నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు రూ.1.22 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసినట్టు తేలింది. హైదరాబాద్‌ నగర శివారు, గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామపంచాయతీకి కోట్లల్లో ఆదాయం ఉంటుంది.

వాటిని సక్రమంగా ఖర్చుచేసి ప్రజావసరాలను తీర్చాల్సిన సర్పంచ్‌ పంచాయతీరాజ్‌ నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టాతిరాజ్యంగా ఖర్చుచేయటం, కోట్ల నిధులను ఖర్చుచేయకున్నా తప్పుడు బిల్లులు పెట్టి స్వాహా చేసినట్టు గ్రామానికి చెందిన కొండా బాల్‌రాజ్‌ అనే వ్యక్తి లోకాయుక్తలో 2016 డిసెంబరులో ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెలలో జిల్లా పంచాయతీ అధికారి సదరు సర్పంచ్‌కు నోటీసు జారీ చేసి కొత్తూరు ఈవోపీఆర్‌డీని విచారణాధికారిగా నియమించారు. విచారణ చేపట్టిన అధికారి 2017 నవంబర్‌లో నివేదిక అందజేశారు. అప్పటి నుంచి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిన అధికారులు ఎట్టకేలకు  షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయితే ఎన్ని రోజుల్లో సర్పంచ్‌ తమ సంజాయిషీ ఇవ్వాలో పేర్కొనకుండా నోటీసు జారీ వెనక రాజకీయ ఒత్తిళ్లు పనిచేసినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement