ఢిల్లీ.. అమరావతికి వచ్చేసింది: మోదీ | national capital has come to amaravathi, says narendra modi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ.. అమరావతికి వచ్చేసింది: మోదీ

Oct 22 2015 2:08 PM | Updated on Aug 18 2018 9:00 PM

ఢిల్లీ.. అమరావతికి వచ్చేసింది: మోదీ - Sakshi

ఢిల్లీ.. అమరావతికి వచ్చేసింది: మోదీ

కొత్త రాజధాని నగర రూపకల్పనకు కేంద్రం భుజాలు కలిపి పనిచేస్తుందని, అందుకే.. అమరావతికి ఢిల్లీ వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

''ప్రియమైన సోదర, ప్రియమైన సోదరీమణులారా.. నమస్కారం. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు'' అని ప్రధానమంత్రి తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రివర్గంలో సహచరులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, అసోం నాగాలాండ్ గవర్నర్ ఆచార్య, తెలంగాణ సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ,నిర్మలా సీతారామన్, జపాన్ మంత్రి, యోసుకి, కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భోంస్లే.. అందరినీ పేరుపేరునా ప్రస్తావించారు.

  • విజయదశమి పర్వదినం, నవరాత్రి శక్తి ఉపాసన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన అడుగు వేసింది.
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని కొన్ని శతాబ్దాలుగా తన సాంస్కృతిక వారసత్వాన్ని కలుపుకొని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని కొత్త రంగులు, ఆధునిక హంగులతో ఆంధ్రప్రదేశ్ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రజా రాజధాని రూపొందుతోంది.
  • అందుకు ఇక్కడి ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
  • ప్రభుత్వం ఏర్పడిన ఇంత తక్కువ సమయంలో చంద్రబాబు త్వరగా తన చేతుల్లోకి ఈ పని తీసుకున్నారు,  ప్రపంచంలో అత్యుత్తమం అనుకున్నవన్నీ ఇక్కడకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
  • అందుకు చంద్రబాబుకు అభినందనలు తెలియజేస్తున్నాను.
  • మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కొత్త నగరాలు చాలా తక్కువ వచ్చాయి.
  • అందువల్ల దేశంలో కొత్త నగరాలు రూపొందించడం అనేది దేశ ప్రజలకు అంతగా అలవాటు కాలేదు.
  • దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో పట్టణీకరణను ఒక సమస్యగా భావించారు. అందువల్లే మనం ఈ గ్రోత్ సెంటర్ దిశగా అసలు చూడలేదు.
  • పట్టణాభివృద్ధిని మనం సమస్యగా చూడకూడదు, దాన్ని ఒక అవకాశంగా భావించాలి.
  • అందుకే ప్రపంచం ఎలా మారుతోందో, టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారో.. అలా వంద స్మార్ట్ సిటీల రూపకల్పన కోసం మహత్తర పథకం చేపట్టాం.
  • ఈ నగరాలు ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఉపయోగపడేలా వాటి రూపకల్పన ఉండాలన్నది మా తపన, అందుకే కృషి చేస్తున్నాం.
  • ఈ కొత్త నగరాలలో అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక రవాణా, గ్రీనరీ.. అన్నీ ఉంటాయి. వ్యర్థాలు ఏమాత్రం ఉండవు. వాహనాలు అక్కర్లేకుండా నడిచే ఆఫీసులకు వెళ్లేలా ఉంటాయి.
  • దేశంలో పట్టణాభివృద్ధి దిశగా మేం వేసిన అడుగులో అమరావతి అన్నింటికీ ఒక మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
  • కొత్త నగరాలు నిర్మించడమో ఎంత కష్టమో తమకు బాగా తెలుసని జపాన్ మంత్రి ఇప్పుడే చెబుతున్నారు..
  • నా జీవితంలో కూడా అలాంటి సవాలు వచ్చింది. 2001లో గుజరాత్‌లో భారీ భూకంపం వచ్చి కచ్ జిల్లా మొత్తం, మరికొన్ని ఇతర నగరాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
  • ఆ తర్వాతే నేను ముఖ్యమంత్రి అయ్యి, ఆ ప్రాంతాలను పునర్నిర్మించాల్సి వచ్చింది. రాజకీయ నిబద్ధత, ప్రజల మద్దతు అన్నీ ఉంటే.. ఏదైనా సాధించవచ్చన్న విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ కచ్ జిల్లా.
  • ఇప్పుడా జిల్లా దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంది.  
  • అమరావతికి రావాలని నన్ను ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను.
  • చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి పిలిచినట్లు తెలిసినప్పుడు సంతోషం అసలు పట్టలేకపోయాను. ప్రత్యేకంగా అందుకు అభినందనలు చెబుతున్నాను.
  • కొందరి రాజకీయ స్వార్థం కారణంగా తొందరపాటుతో రాష్ట్ర విభజన చేశారు. ఆ సందర్భంగా అమాయకుల ప్రాణాలు పోవడం, ఆస్తులు ధ్వంసం కావడం తెలిసిందే.
  • ఆంగ్లేయులు కొన్ని ఇక్కడ వదిలిపోయారు. అందువల్లే మన దేశంలో ఏదో ఒక అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి.
  • పాత ప్రభుత్వం కూడా కొన్ని ఇలా చేయడం వల్లే ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు సమస్యలు ఏర్పడుతున్నాయి.
  • కానీ ఇప్పుడు మాత్రం ఆంద్ర - తెలంగాణ ఏ రాష్ట్రమైనా మన ఆత్మ తెలుగే.
  • తెలుగు ఆత్మకు రెండు భుజాలు ఆంధ్ర, తెలంగాణ. ఈ రెండూ కలిసి పనిచేస్తే.. దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి.
  • కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దాన్ని బాగా ఉపయోగించుకునే శక్తి ఈ తెలుగు గడ్డమీదే ఉంది.
  • ఆంధ్రలోని లక్షలాది మంది యువత ప్రపంచం నలుమూలలా తమ టెక్నాలజీ సామర్థ్యంతో ప్రముఖ స్థానాలు సంపాదించి, మనకు పేరు తెస్తున్నారు.
  • ఇక్కడ మంచి తెలివైన కుర్రాళ్లు ఉన్నారు కాబట్టి, వాళ్లు ఇన్నోవేషన్, స్టార్టప్‌లతో ఆంధ్రప్రాంతానికి మరో కొత్త నిశ్శబ్ద విప్లవం తెస్తారు.
  • రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త ఆర్థిక క్రాంతిని సాధిస్తుందనే విశ్వాసం ఉంది. ఈ యువజనం మీదే ఆర్థిక వ్యవస్థ ఆధారపడుతుంది.
  • 80 కోట్ల మంది 25-40 ఏళ్ల మధ్య యువత ఎక్కడ ఉన్నారో, వాళ్లు ప్రపంచంలో ఆర్థికశక్తిగా ఎదిగేందుకు దేశానికి సాయపడతారు.
  • ఆంధ్ర, తెలంగాణ వేరుపడినా రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందేందుకు పనిచేస్తే రెండు రాష్ట్రాలకూ ఉపయోగం ఉంటుంది.
  • వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు, రక్తం పారలేదు. తర్వాత కూడా సమస్యలు రాలేదు.
  • ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ విషయంలోనూ అలాగే జరగాలని నేను భావిస్తున్నాను.
  • గత ప్రభుత్వం చాలా పనులు చేసింది. వాటిని సరిచేయడానికే నాకు శక్తి, సమయం సరిపోతోంది.
  • కానీ కేంద్రం అన్ని రకాలుగా ఈ రెండు రాష్ట్రాలకు సహాయంగా ఉంటుంది. సంపూర్ణ సహకారం అందిస్తుంది.
  • కేంద్రం , చంద్రబాబు మధ్య ఫ్రీక్వెన్సీ బాగా కలుస్తుంది. పనులు చేయడంలో, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చాలా సౌలభ్యం ఉంటుంది.
  • ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మేం మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టాం. పునర్విభజన చట్టంలో మానవ వనరుల అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఏఐఐఎంఎస్, ఎన్ఐటీ, ఐఈఎస్‌ఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ.. ఇవన్నీ అతి తక్కువ సమయంలోనే ఏర్పాటుచేయడానికి కృషి చేశాం.
  • ప్రజల రాజధాని తయారవుతుంటే మీరంతా మీమీ ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చారు.
  • నాకు ఈ విషయం తెలిసినప్పుడు, నాకు కూడా అనిపించింది.. అందుకే నేను కూడా మట్టి, నీరు వెంట తీసుకొచ్చాను.
  • పార్లమెంటు ఆవరణ నుంచి మట్టిని, యమునా నది నుంచి నీటిని తీసుకొచ్చాను.
  • మన దేశంలో నది అంటే ఒక సంస్కృతి. చంద్రబాబుకు నేను ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించారు.. ఎంతో ఉద్వేగానికి గురయ్యానన్నారు.
  • ఆంధ్రప్రజలకు ఒకటే చెబుతున్నా.. ఇది కేవలం పార్లమెంటు మట్టి, యమునా నీరు మాత్రమే కాదు.. ఇది ఒకరకంగా దేశ రాజధాని అమరావతికి వచ్చేసిందన్న సందేశం.
  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఢిల్లీ ఎప్పుడూ చేతులు కలిపి పనిచేస్తుందనేందుకు ఇదో సంకేతమని చెబుతున్నాను.
  • రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజన చేసినవాళ్లు ఇప్పుడూ విషబీజాలు నాటుతున్నారు. యువకుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు.
  • కానీ ఈ అమరావతి నగరం నుంచి ఆంధ్రప్రజలకు ఒకటే చెబుతున్నా.. పునర్విభజన చట్టంలో ఏం చెప్పినా.. ప్రతి అక్షరాన్నీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తుందని చెబుతున్నాను.
  • చంద్రబాబు- మోదీ జోడీతో ఆంధ్రప్రజలందరి కలలను నూటికి నూరు శాతం నెరవేరుస్తాం.
  • భారత్ మాతాకీ జై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement