పాత కొత్తల మేలు కలయిక 'మధుపత్రాలు'
రాజమహేంద్రవరం కల్చరల్ : పాత విలువలను కాపాడుకుంటూ, ఆధునిక భావాలకు స్వాగతం పలికిన ‘మధుపత్రాలు’ కవితా సంపుటిని వెలువరించిన కవయిత్రి ఉప్పలూరి శైలజ అభినందనీయురాలని ప్రాణహిత కవి సన్నిధానం నరసింహశర్మ అన్నారు. ఎన్జీఓ హో
కవి సన్నిధానం నరసింహశర్మ
కవితాసంపుటి ఆవిష్కరణ
రాజమహేంద్రవరం కల్చరల్ : పాత విలువలను కాపాడుకుంటూ, ఆధునిక భావాలకు స్వాగతం పలికిన ‘మధుపత్రాలు’ కవితా సంపుటిని వెలువరించిన కవయిత్రి ఉప్పలూరి శైలజ అభినందనీయురాలని ప్రాణహిత కవి సన్నిధానం నరసింహశర్మ అన్నారు. ఎన్జీఓ హోమ్లో కళాగౌతమి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మధుపత్రాలు కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ఆయన పుస్తక సమీక్ష చేశారు. కవితా సంపుటిలో కవయిత్రి అన్ని అంశాలను స్పృశించారని చెప్పారు. అలతి, అలతి పదాలలో అనల్పమైన భావాన్ని కవయిత్రి చెప్పగలిగారని, భావజాలం వ్యక్తీకరణలో ఎక్కడా గందరగోళం లేదని ఆయన ప్రశంసించారు. బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ ‘కాగితాలు ఎన్నెన్ని పితికితే–కవిత ఒలికేను చుక్కలా’ అన్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కవితను ఉటంకించారు. ‘క’ అంటే కమనీయం, ‘వి’ అంటే విద్వత్, ‘త’ అంటే తాత్వికతని కవితకు ఆయన అర్థం చెప్పారు. కుటుంబం, సమాజం, ఆధ్యాత్మికం అన్నిటిని కవయిత్రి కవితల రూపంలో స్పృశించారని కొనియాడారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్య వంతం చేసే అంశాలను కవయిత్రి అక్షరబద్ధం చేశారని తెలిపారు. డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు (పేరవరం) మాట్లాడుతూ కవులు పరమహంసల వంటివారని, చెడును వదిలి, మంచిని స్వీకరిస్తారని చెప్పారు. సాహితీవేత్త చీకటి దివాకర్ (విజయనగరం) సభకు అధ్యక్షత వహించారు. మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ (కాకినాడ), డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ (వరంగల్), కె.నాగేశ్వర్ (హైదరాబాద్) తదితరులు కవయిత్రని అభినందించారు. కవయిత్రి శైలజను ఘనంగా సత్కరించారు. ముళ్ళపూడి శేషుకుమార్ స్వాగత వచనాలు పలికారు. కవయిత్రి భర్త, బ్యాంకు అధికారి యు.వి.పి.ఆర్.కె.ప్రసాద్ స్వాగత వచనాలు పలికారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.