సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్పై జనసేన వేసిన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదు.. కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు శ్రీధర్ ఎలా హాజరవుతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘అరవ శ్రీధర్కు పవన్ కల్యాణ్ అంటే లెక్క లేదా?. లేదంటే ఇంటర్నెల్గా శ్రీధర్కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా?. ఒక వేళ కమిటీ రిపోర్టు ఇస్తే మాకు చెప్పండి. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు.’’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
కమిటీ నివేదిక ఇవ్వకుండానే కండువాతో అరవ శ్రీధర్
ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు పలుదఫాలు గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై ఓ కమిటీని నియమిస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చేవరకు ఎమ్మెల్యే శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశిస్తున్నట్లు జనసేన అధినాయకత్వం ప్రకటించడం తెలిసిందే.
అయితే ఆ కమిటీ ఇంతవరకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోగా.. ఎమ్మెల్యే శ్రీధర్ శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లిలో జరిగిన కార్యక్రమంలో జనసేన కండువా కప్పుకొని పాల్గొనడం గమనార్హం. కమిటీ నివేదిక ఇవ్వకుండానే ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీ కండువా కప్పుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కమిటీ పేరుతో జనసేన నాయకత్వం కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఇంతవరకు ఎమ్మెల్యే నిర్వాకాలను కనీసం ఖండించకపోవటాన్ని తప్పుబడుతున్నారు. రెండు రోజుల కిందట అరవ శ్రీధర్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించే నెపంతో పొలాల్లో పర్యటించి ప్రజలకు ముఖం చూపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే.


