నిలదీస్తేనే నీళ్లిస్తారా? | ladies dharna for water | Sakshi
Sakshi News home page

నిలదీస్తేనే నీళ్లిస్తారా?

Jul 27 2017 11:05 PM | Updated on Sep 5 2017 5:01 PM

నిలదీస్తేనే నీళ్లిస్తారా?

నిలదీస్తేనే నీళ్లిస్తారా?

అల్లవరం : శివారు ప్రాంతాల్లో జీవించడం మేము చేసుకున్న పాపమా.. చుక్క తాగునీటి కోసం రోజులు తరబడి వేచిచుడాలా.. ఓట్లు వేళ వంగి వంగి దండాలు పెట్టే నాయకుల్లారా మేము తాగునీటికి పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అని మహిళలు ప్రశ్నించారు. ధర్నాలు చేస్తేనే

గుండెపూడి మహిళల ఆగ్రహం
రహదారిపై బైఠాయింపు
ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రాజెక్టుకు తాళం వేసి నిరసన
144 సెక్షన్‌ అమల్లో ఉండగా ఆందోళనలు తగదన్న ఎస్సై
ఆగమేఘాలపై వచ్చిన అధికారులకు సూచనలు
సమస్య పరిష్కారానికి హామీతో ఆందోళన విరమణ
అల్లవరం : శివారు ప్రాంతాల్లో జీవించడం మేము చేసుకున్న పాపమా.. చుక్క తాగునీటి కోసం రోజులు తరబడి వేచిచుడాలా.. ఓట్లు వేళ వంగి వంగి దండాలు పెట్టే నాయకుల్లారా మేము తాగునీటికి పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అని మహిళలు ప్రశ్నించారు. ధర్నాలు చేస్తేనే సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆగమేఘాల మీద వస్తారనేది గురువారం నిరూపణ అయింది. గుండెపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పోతులవారిపేట, పల్లిపాలేనికి చెందిన గ్రామస్తులు గుండెపూడి ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రాజెక్టు ఎదురుగా మెయిన్‌రోడ్డుపై గురువారం ధర్నాకు దిగారు. తొలుత ఆందోళనకారులు తాగునీటిని పంపింగ్‌ చేసే ప్రదేశంలో గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే ఓహెచ్‌ఆర్‌కు నీటిని మళ్లించకుండా మోటార్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి గేటుకు తాళాలు వేశారు. అనంతరం మెయిన్‌రోడ్డుపై బైఠాయించి ఐదు రోజులుగా తాగునీరు లేక ప్రజలు అల్లాడుతుంటే ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. మా పంచాయతీ పరిధిలో ఓహెచ్‌ఆర్‌ ట్యాంకు ఉన్నా మా దాహం తీర్చడం లేదని మండిపడ్డారు. మన నీరు మనకే కావాలి అనే నినాదాన్ని చేపట్టారు. గ్రామంలో అక్రమ కుళాయిలకు విద్యుత్‌ మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారని, అధికారులు వచ్చి సమస్య పరిష్కారిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. దీనితో ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ధర్నాలు చేయరాదని, ధర్నాలు చేసినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇవ్వడంతో అందోళనకారులు రోడ్డును ఖాళీచేశారు. అనంతరం జెడ్పీటీసీ వేగిరాజు ప్రవీణ, సర్పంచ్‌ పినిపే ప్రకాశరావు సమక్షంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ నటరాజ్, జేఈలు రాజశేఖర్, శ్రీధర్, వేగిరాజు వెంకట్రాజు, సాధనాల వెంకట్రావులతో ఎస్సై చర్చించారు. శివారు ప్రాంతాలకు తాగునీరు సరఫరా కానప్పుడు లోపం ఎక్కడుందో గ్రహించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. గ్రామంలో అక్రమ కుళాయిలు ఉన్నప్పుడు పంచాయతీ తీర్మానం చేసి తొలగించాలని సూచించారు. దీనిపై డీఈ స్పందిస్తూ శివారు ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. గుండెపూడి ప్రాజెక్టు పరిధిలో అక్రమ కుళాయిలను తొలగిస్తామని హామీచ్చారు. ఈ ధర్నాలో  కందికట్ల సత్యవతి, జంగా సత్యవతి, నక్కా ధనలక్ష్మి, జంగా మంగాదేవి, పోతుల వెంకటలక్ష్మి, మాకే బాలరత్నం, పోతులు నరిసింహారావు, పోతుల అప్పారావు, వడ్డి రాంబాబు, కొపనాతి వెంకటేశ్వరారవు, కొపనాతి సద్గురుమూర్తి, గుంటూరి కృష్ణంరాజు, కాశిరాజు భారీ సంఖ్యలో మహిళలు  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement