తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యమం
వంటావార్పును పోలీసులు భగ్నం చేయడంతో ఆందోళన తీవ్రతరం
విశాఖ తెలుగుతల్లి కూడలి వద్ద బైఠాయించి నినాదాలు
ఉక్కునగరం: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉక్కు నిర్వాసితులు కదంతొక్కడంతో విశాఖపట్నం దద్దరిల్లింది. స్టీల్ప్లాంట్ నిర్వాసిత సంఘాలు తలపెట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. దీంతో నిర్వాసితులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. దీంతో స్టీల్ప్లాంట్ రోడ్లపై ఉద్రిక్తత నెలకొంది. సుమారు 8,500 మందికి ఉపాధి కల్పించాలని, అంతవరకు భృతి చెల్లించాలని తదితర డిమాండ్లతో నిర్వాసితుల సంఘం శనివారం ఉదయం నుంచి హిల్ టాప్ గెస్ట్హౌస్ కూడలి వద్ద ఉన్న కొవ్వొత్తుల జంక్షన్లో 48 గంటల వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనికి అనుమతించి నిరాకరించిన పోలీసులు ప్లాంట్ రహదారులన్నింటిలో మోహరించారు.
ప్లాంట్ వైపు వచ్చేవారిని తనిఖీ చేశారు. నాయకులను ముందురోజు నుంచే బైండోవర్ పేరిట భయపెట్టారు. దీంతో ఉదయం కార్యక్రమం సమయానికి నిర్వాసితులు అక్కడికి చేరుకోలేక పోయారు. పోలీసుల అణచివేత చర్యలపై ఆగ్రహంతో రగిలిపోయిన నిర్వాసితులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున కణితి రోడ్డు ద్వారా తెలుగుతల్లి కూడలి వద్దకు ర్యాలీగా దూసుకొచ్చారు. చాలామంది పోలీసులను దాటుకుని ఆ కూడలికి చేరుకున్న నిర్వాసితులు అక్కడ బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని, పోలీసుల వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తమకు జరిగిన అన్యాయాన్ని తెలపడానికి కూడా స్వేచ్ఛలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. పెదగంట్యాడ, గంగవరం, అగనంపూడి, వడ్లపూడి, నెల్లిముమక్కు, అప్పికొండ తదితర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో నిర్వాసితులు అక్కడకు చేరడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు దొరికినవారిని దొరికినట్టుగా ట్రక్కులో స్టీల్ప్లాంట్ పోలీస్స్టేషన్కు తరలించారు. తమకు ఎకరా చొప్పున భూమి ఇవ్వాలని, వన్టైం సెటిల్మెంట్ చేయాలని, అంతవరకు ఉపాధి భృతి చెల్లించాలని నిర్వాసితులు పోలీస్స్టేషన్ వద్ద నినాదాలు చేశారు. కాగా, శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారంటూ స్టీల్ప్లాంట్ పోలీసులు 55 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఖాకీమయం
స్టీల్ప్లాంట్ రహదారులు, కొవ్వొత్తుల జంక్షన్ పోలీసులతో నిండిపోయాయి. సౌత్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బందితో మొత్తం ఖాకీమయంగా మారింది. పోలీసులు ఉదయం నుంచి చేసిన హడావుడి వల్ల విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. నిర్వాసితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనే పరిస్థితి లేకుండా చేయాలన్న పోలీస్ల అతి ప్రవర్తనను ప్రజలు తప్పుపట్టారు.
బిగిసిన ‘ఉక్కు’పిడికిలి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆఫీస్ ముట్టడి
నిర్వాసిత సంఘాల నేతలతో కొలిక్కిరాని పోలీసుల చర్చలు
ఎమ్మెల్యే పల్లా వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టిన ఆందోళనకారులు
ఎకరం భూమి లేదా వన్టైం సెటిల్మెంట్ చేయాలని డిమాండ్
32 మంది నిర్వాసితులను అరెస్టు చేసిన పోలీసులు
గాజువాక: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆఫీసును విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ముట్టడించారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు ఎకరం చొప్పున భూమి ఇవ్వాలని, లేదా వన్ టైం సెటిల్మెంట్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గాజువాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు పోలీసులు నిర్వాసితులను అదుపులోకి తీసుకొని వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలించారు.
వంటావార్పును అడ్డుకోవడంతో..
తొలుత తమకు న్యాయం చేయాలన్న డిమాండ్తో ఉక్కు నిర్వాసిత సంఘాలు స్టీల్ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ వద్ద 48 గంటల వంటా వార్పు కార్యక్రమానికి సిద్ధపడ్డారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు పాతగాజువాకలోని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయానికి వచ్చి ముట్టడికి దిగారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు వారిని కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. స్టీల్ప్లాంట్, నిర్వాసితులకు మద్దతుగా గతంలో హామీలు గుప్పించిన పల్లా ఇప్పుడు గెలిచిన తర్వాత నిర్వాసితుల సమస్యను పట్టించుకోవడం మానేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వాసితులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంటే ఆయన స్పందించకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలివ్వండి.. లేదా మా భూములు మాకివ్వండి అంటూ పెద్దపెట్టున నినదించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్వాసిత నాయకులతో చర్చించేందుకు విఫలయత్నం చేశారు. తమ డిమాండ్పై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వచ్చి హామీ ఇవ్వాలని, ఎమ్మెల్యేతో చర్చలు జరిపి వెళ్లిపోతామని నిర్వాసితులు చెప్పినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 32 మంది నిర్వాసితులను అరెస్టు చేసి గాజువాక పోలీస్ స్టేషన్కు తరలించారు.


