మంత్రి సంధ్యారాణి ఇంటిని ముట్టడించిన టీచర్లు | Teachers besiege Minister Sandhyaranis house | Sakshi
Sakshi News home page

మంత్రి సంధ్యారాణి ఇంటిని ముట్టడించిన టీచర్లు

Jun 27 2026 4:21 AM | Updated on Jun 27 2026 4:21 AM

Teachers besiege Minister Sandhyaranis house

సాలూరు: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటిఎదుట గిరిజన గురుకులాల అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు శుక్రవారం ధర్నా చేశా­రు. మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సుమారు 15 ఏళ్లు­గా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ఉన్నపళంగా తొలగించడం దారుణమన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. పెద్దఎత్తున ధర్నా నిర్వహించి ‘మాకు న్యా­యం చేయండి.. మా ఉద్యోగాల్ని కాపాడండి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 

టీచర్ల కష్టాన్ని విస్మరిస్తే.. ప్రశ్నలు గుమ్మం దాటి ప్రజల తీర్పుగా మారతాయని అల్టిమేటం జారీ చేశారు. తమకు బూటకపు హామీలతో పనిలేదని.. న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డీఎస్సీ–2025 వల్ల తమ ఉద్యోగ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుండటంతో సుమారు 40 రోజులుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. ఆ సందర్భంలో మంత్రి సంధ్యారాణి ఎవరి ఉద్యోగాలు తొలగించబోమని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

ఈ ఏడాది 1,456 మంది అవుట్‌సోర్సింగ్‌ టీచర్లను రెన్యువల్స్‌ చేయాల్సి ఉండగా, 788 మందికి తొలివిడతలో రెన్యువల్‌ చేశామని చెప్పి 532 మందికి మాత్రమే రెన్యువల్‌ ఆర్డర్స్‌ ఇచ్చారని తెలిపారు. అందరికీ రెన్యువల్‌ ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి యూనియన్‌ నాయకులతో మాట్లాడారు. 216 మందిని నాన్‌ టీచింగ్‌లో సర్దుబాటు చేస్తున్నామని, మిగిలిన వారి కోసం ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఫైలు పంపామని, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఏ తేదీకి ఎప్పుడు చేస్తారో తెలపలేదని, అందరికి న్యాయం చేయాలని మంత్రిని కోరినట్టు యూనియన్‌ నాయకులు తెలిపారు. మంత్రి హామీ మేరకు ధర్నాను తాత్కాలికంగా విరమించామన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement