
మరణంలోనూ వీడని బంధం..
కడదాకా ఒకరికొకరు తోడు ఉండి.. ఆదర్శ జీవనం సాగించిన ఆ దంపతులు గం టల వ్యవధిలోనే తనువు చాలిం చారు. ఈ విషాదకర సంఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది.
భార్య మృతిని తట్టుకోలేక తనువు చాలించిన భర్త
ధన్వాడ : కడదాకా ఒకరికొకరు తోడు ఉండి.. ఆదర్శ జీవనం సాగించిన ఆ దంపతులు గంటల వ్యవధిలోనే తనువు చాలించారు. ఈ విషాదకర సంఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. ధన్వాడ మండలం మరికల్కు చెందిన బండర్పల్లి మణెమ్మ(70), నాగప్ప(75) దంపతులు. వీరికి కూతురు, కొడుకు సం తానం కాగా, కొడుకు ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు లేడని దిగులుతో మణెమ్మ ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
మంచంపట్టిన భార్యకు నాగప్ప అన్ని సపర్యలూ చేసేవాడు. అయితే, ఆమె మంగళవారం రాత్రి కనుమూసింది. బుధవారం మధ్యాహ్నం మణెమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక తనకు తోడునీడ లేదన్న వేదనతో.. పుట్టెడు శోకంతో ఉన్న నాగప్ప సాయంత్రం 4:30 గంటలకు కుమిలి కుమిలి ఇంట్లోనే కన్నుమూశాడు. భార్యాభర్తలు ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.