మరణంలోనూ వీడని బంధం | Husband and wife died the same day | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని బంధం

Aug 3 2016 8:11 PM | Updated on Oct 8 2018 5:07 PM

కడదాకా ఒకరికొకరు తోడుంటామని జీవనయానం సాగించిన ఆ దంపతులు ఒకరి తరువాత మరొకరు తనువు చాలించారు.

కడదాకా ఒకరికొకరు తోడుంటామని.. ఆదర్శ జీవనయానం సాగించిన ఆ దంపతులు ఒకరి తరువాత మరొకరు తనువు చాలించారు. అనారోగ్యానికి గురైన భార్య మరణించడంతో ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండెపగిలి భర్త కనుమూశాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్‌కు చెందిన బండర్‌పల్లి మణెమ్మ(70), నాగప్ప(75) దంపతులు అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు.

 

వీరికి కూతురు, కొడుకు సంతానం కాగా, కొడుకు ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. కొడుకు లేడనే వేదనతో మణెమ్మ గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. నాగప్ప రెక్కలకష్టం మీదే ఆ కుటుంబం బతుకీడుస్తోంది. మంచంపట్టిన భార్యకు నాగన్నే అన్ని సపర్యలూ చేసేవాడు. చేతగాని వయస్సులోనూ ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మ మంగళవారం రాత్రి కనుమూసింది.

 

అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. మణెమ్మ చనిపోయిన విషయాన్ని బంధువులకు చెప్పగా, వారు రావడానికి కొంత ఆలస్యమైంది. బుధవారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఇళ్లకు చేరుకున్నారు. ఎవరి దుఃఖంలో వారున్నారు. తోడునీడ లేదని.. పుట్టెడు శోకంతో ఉన్న నాగన్న సాయంత్రం 4:30 గంటలకు కుమిలి కుమిలి ఇంట్లోనే కన్నుమూశాడు. భార్యాభర్తలు ఒకేరోజు.. కొన్ని గంటల వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement