
అందరి దృష్టి గజ్వేల్పైనే..
అద్భుత ఘట్టానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది... ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ తొలి పర్యటనకు ఒక్క రోజే మిగిలి ఉంది.
- రేపు ఆవిష్కృతం..
- ప్రధాన ఘట్టం
- అద్భుత ఘట్టానికి మిగిలింది ఒక్క రోజే
- సభపై జాతీయ స్థాయిలో ఆసక్తి
- కేసీఆర్ ‘భగీరథ’ యత్నం... ఫలించబోతున్న క్షణాలపై ఉత్కంఠ
- పూర్తి కావచ్చిన ప్రధాని సభ ఏర్పాట్లు
- పర్యవేక్షించిన మంత్రి హరీశ్రావు
గజ్వేల్:అద్భుత ఘట్టానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది... ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ తొలి పర్యటనకు ఒక్క రోజే మిగిలి ఉంది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాబోతున్న ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ ‘మిషన్ భగీరథ’... ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్న క్షణాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. గజ్వేల్ మండలం కోమటిబండలో ఈనెల 7న మధ్యాహ్నం నిర్వహించబోతున్న ప్రధాని సభకు ఒకే రోజు మిగిలి ఉండటంతో.. దాదాపుగా ఏర్పాట్లను పూర్తికావచ్చాయి.
సభావేదిక, గుట్టపై హెడ్ రెగ్యులేటరీ వద్ద మిగిలిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్తో కలిసి సభావేదిక సమీపంలో నెంటూర్ రోడ్డు వైపున ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగగానే... రాష్ట్ర యంత్రాంగం ప్రధానితోపాటు సీఎంకు ఘనంగా స్వాగతం పలకనున్నారు.
కార్యక్రమ వివరాలిలా...
గుట్టపై గల హెడ్ రెగ్యులేటరీ వద్ద 7వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత సీఎం కేసీఆర్తో కలిసి ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరిస్తారు. పక్కనే గల నల్లా, పంప్హౌస్ను ప్రారంభిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫొటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. సుమారు 7నుంచి 10 నిమిషాలపాటు ప్రధాని ఇక్కడ గడిపే అవకాశముంది. గుట్టపై నుంచి కిందికి దిగగానే బహిరంగ సభ స్థలిలోని ప్రధాన వేదిక వెనుక భాగంలో మరో ఐదు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రధాని వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రధాని ప్రసంగించే వేదికను మూడు భాగాలుగా విభజించారు. ప్రధాన వేదిక మోదీతోపాటు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఇతర వీవీఐపీలు ఉంటారు.
దీనికి ఎడమ వైపున కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, కుడి వైపున కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుంటారు. మరోవైపు కళాకారుల కోసం వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఓబీ వ్యాన్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని ఈ గ్యాలరీలో కేటాయించారు.
160 ఎకరాల్లో పార్కింగ్
పార్కింగ్ కోసం 160 ఎకరాలు కేటాయించారు. 8 ఎకరాలకు ఒక సెక్టార్ చొప్పున 20 సెక్టార్లుగా విభజించారు. వీవీఐపీలు, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఇతర ప్రముఖుల కోసం కూడా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు వేల ఆర్టీసీ బస్సులను వినియోగించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని డిపోల నుంచి జనాలతో రానున్నాయి. మరో వెయ్యి ప్రైవేట్ బస్సులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. బస్సులను నిలిపేందుకు ఇబ్బంది కాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
అగ్ని మాపక యంత్రాలు...
లైటింగ్, సౌండ్ సిస్టమ్, జనరేటర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే... వినియోగించుకునేలా 50 అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచనున్నారు.
గట్టి నిఘా..
ప్రధాని వచ్చే హెలిపాడ్ ప్రదేశం నుంచి హెడ్రెగ్యులేటరీ, సభావేదిక ప్రాంతంలో నిఘా కొనసాగించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. హెడ్రెగ్యులేటరీ ప్రదేశానికి మీడియాను అనుమతించడం లేదు. అక్కడ ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని... దూరదర్శన్ సహకారంతో అందించడానికి అససరమైన ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై ముందుగా రాష్ట్ర ప్ర«భుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇది పూర్తయ్యాక.. ప్రధాని రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
పరిశీలించిన మంత్రి
కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు శుక్రవారం పర్యవేక్షించారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్, జేసీ వెంకట్రామ్రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంతకుముందు హెలిపాడ్ను పరిశీలించారు. పనులు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత హెడ్రెగ్యులేటరీ వద్ద పైలాన్ తుది దశ పనులను పరిశీలించారు. ఇదే ప్రదేశంలో ల్యాండ్ స్కేపింగ్, ఫొటోఎగ్జిబిషన్ ఏర్పాట్లను సైతం చూశారు. ఆ తర్వాత సభాస్థలికి చేరుకుని వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. పార్కింగ్ స్థలాలపై ఆరా తీశారు. ఇక్కడే ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ప్రధాని తెలంగాణ తొలి పర్యటన దిగ్విజయం చేసి చరిత్రలో నిలిచిపోవాలన్నారు.