ధర పతనమే కారణం
పాకిస్తాన్, వియత్నాం నుంచి పెరిగిన పోటీ
ఉప్పుడు బియ్యం ఎగుమతులూ అంతంతే
తాడేపల్లిగూడెం :
జిల్లాలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా.. ఎగుమతులు డీలాపడ్డాయి. ధర లేకపోవడమే ఇందుకు కారణమైంది. విదేశాలకు ఎగుమతుల నిమిత్తం కాకినాడ పోర్టుకు బియ్యాన్ని పంపిస్తే.. క్వింటాల్కు చేరా (రవాణా చార్జీలతో కలిపి) రూ.2,020 మాత్రమే ధర లభిస్తోంది. ఫలితంగా ఎగుమతుల వైపు మిల్లర్లు, వ్యాపారులు మొగ్గు చూపడం లేదు. పోనీ.. వ్యాపార లావాదేవీలు నడిచేందుకు ఎగుమతులు చేద్దామన్నా.. మార్కెట్లో ధాన్యం ధర పెరిగింది. కనీస మద్దతు ధరకంటే క్వింటాల్కు రూ.65 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఏదో రకంగా ధాన్యం కొని మరాడించే సరికి బియ్యం ధర బాగా పెరుగుతోంది. క్వింటాల్ ధాన్యం ఆడిస్తే 58 నుంచి 62 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయి. క్వింటాల్ బియ్యం రావడానికి 170 కిలోల ధాన్యం మరపట్టించాలి. 170 కిలోల ధాన్యానికి రూ.2,604 వెచ్చించాల్సి వస్తోంది. ఆ బియ్యాన్ని ఎగుమతి చేస్తే క్వింటాల్కు వచ్చేది రూ.2,020 మాత్రమే. తవుడు, చిట్టు, ఊక ద్వారా ఇచ్చే ఆదాయం కలుపుకున్నా క్వింటాల్కు సగటున రూ.400 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మిల్లర్లు, వ్యాపారులు ఎగుమతులపై దృష్టి సారించడం లేదు. రిటైల్ మార్కెట్లో మాత్రం బియ్యం ధరలు జోరుగా ఉన్నాయి. బ్రాండెడ్ పేరుతో విక్రయాలు సాగిస్తున్న 25 కిలోల బస్తా బియ్యం ధర రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఉంది. దీంతో మిల్లర్లు, వ్యాపారులు స్థానిక మార్కెట్లపైనే ఆధారపడి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
పాకిస్తాన్, వియత్నాం నుంచి పోటీ
గోదావరి జిల్లాలో పండే ముతక రకం బియ్యానికి దక్షిణాఫ్రికాలోని కొండ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కాకినాడ పోర్టు ద్వారా ఓడల్లో బియ్యం రవాణా జరిగేది. ఎగుమతి సంస్థల తరఫున కమీషన్దారులు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లను స్థానిక వ్యాపారులకు, మిల్లర్లకు ఇచ్చేవారు. అయితే, ఇదే రకం బియ్యం ఎగుమతుల విషయంలో పాకిస్తాన్, వియత్నాం దేశాల నుంచి పోటీ ఎక్కువైంది. ఇక్కడి వ్యాపారుల కంటే తక్కువ ధరకు ఆ రెండు దేశాలు ఎగుమతులు చేస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది.
ఉప్పుడు బియ్యానికీ డిమాండ్ అంతంతే
బాయిల్డ్ రైస్గా పిలిచే ఉప్పుడు బియ్యానికి సైతం డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంది. మన ప్రాంతం నుంచి కేరళ రాష్ట్రానికి అధికంగా ఉప్పుడు బియ్యం ఎగుమతి అయ్యేవి. అయితే, ఇక్కడి వ్యాపారులకు ఆ రాష్ట్రంలోని కొనుగోలుదారులు భారీ మొత్తాలను బకాయిపడ్డారు. ఇటీవల కొంత మొత్తాలను చెల్లించడంతో ఎగుమతులు కొంతమేర పుంజుకున్నాయి. జిల్లా నుంచి రోజుకు రెండుమూడు లారీల సరుకు వెళుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్రధాన కంపెనీలు ఉప్పుడు బియ్యం ఎగుమతిలో జోరుగా ఉన్నాయి.
పడిపోయిన ఉప ఉత్పత్తుల ధరలు
ధాన్యం మరాడించగా వచ్చే ఉప ఉత్పత్తుల ధర ఏమంత ఆశాజనకంగా లేవు. నూకల ధర క్వింటాల్ రూ.1,700 నుంచి రూ.1,500కు పడిపోయింది. తవుడు ధర క్వింటాల్ ధర రూ.1,700 నుంచి రూ.200 తగ్గి రూ.1,500 పలుకుతోంది.
గిట్టుబాటు కావడం లేదు
బియ్యం ఎగుమతులు ఆశాజనకంగా లేవు. కాకినాడ పోర్టుకు బియ్యం పంపినా క్వింటాల్కు రూ.2,020కి మించి రావడం లేదు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరకు ధాన్యం కొని మిల్లు ఆడించి బియ్యం ఎగుమతి చేస్తే సొమ్ములు నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ కారణంగానే బియ్యం ఎగుమతులు మానుకోవాల్సి వచ్చింది.
బూరాడ శ్రీనివాస్, రైస్ మిల్లర్, తాడేపల్లిగూడెం