ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
చెన్నై , అన్నానగర్: ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. చెన్నై సమీపం పూందమల్లి కుమరన్చావడి మురుగపిల్లై నగర్కి చెందిన రాజామణి. ఇతని కుమార్తె ఆశ (24). ఈమె, పూందమల్లిలో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈమె ఎన్జీఆర్ నగర్కు చెందిన రవి కుమారుడు వినోద్కుమార్ (29) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను శ్రీపెరుంబత్తూర్లో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఇదిలాఉండగా తనను వివాహం చేసుకోవాలని ఆశ ఒత్తిడి చేసింది. అందుకు వినోద్కుమార్ అంగీకరించలేదు. ఆశ తల్లిదండ్రులు వెళ్లి వినోద్కుమార్ కుటుంబీకులతో వివాహం గురించి మాట్లడగా వారు తిరస్కరించారు.
ఈ స్థితిలో బుధవారం ఆశ తన ప్రియుడు వినోద్కుమార్ ఇంటి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగింది. ఆమె మాట్లాడుతూ మేమిద్దరం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. వినోద్కుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో వినోద్కుమార్ మాట్లాడడం మానేశాడు. దీనిపై పూందమల్లి మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాను. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో 2నెలల తరువాత నన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం మళ్లీ వివాహానికి ఒప్పుకోవడం లేదని వాపోయింది. పోలీసులు ఆమెతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితురాలు ధర్నా విరమించింది.