చున్నీయే యమపాశమై..!

Women Deceased in Bike Accident YSR Kadapa - Sakshi

బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

ముఖానికి కట్టుకున్న చున్నీ బైక్‌ చక్రానికి చుట్టుకోవడంతో ప్రమాదం

వైఎస్‌ఆర్‌ జిల్లా , గోపవరం: ముఖానికి చుట్టుకున్న చున్నీయే యమపాశమై మహిళ ప్రాణం తీసింది. గోపవరం మండలం పెద్దపోలుకుంట గ్రామానికి చెందిన మునగల లక్ష్మీదేవి (26) ఈ ప్రమాదానికి గురైంది. మునగల సుబ్రహ్మణ్యం తన భార్య లక్ష్మీదేవి, ముగ్గురు పిల్లలతో కలిసి 15 రోజుల క్రితం ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని చీమకుర్తిలో కూలీ పనులు చేసుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. ఎన్ని రోజులు ఉన్నా పనులు దొరక్కపోవడంతో ఆదివారం మోటార్‌సైకిల్‌పై స్వగ్రామమైన పెదపోలుగుంట గ్రామానికి బయలుదేరారు.(విమాన ప్రమాదం.. పైలట్ల దుర్మరణం )

వేడిగాలి తగలకుండా లక్ష్మీదేవి చున్నీని ముఖానికి కట్టుకుంది. మార్గంమధ్యలోని భూమిరెడ్డిపల్లె వద్ద 565 జాతీయ రహదారిపై బైక్‌ వెనుక చక్రానికి చున్నీ చుట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడింది. తల, ఛాతికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే చనిపోవడంతో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై అంబటి చంద్రశేఖర్‌ పరిశీలించారు. అనంతరం కనిగిరి వైద్యశాలకు వెళ్లి ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు పొదిలి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ('నారాయణ స్కూల్‌'కు నోటీసులు)

మిన్నంటిన రోదనలు
మృతురాలు లక్ష్మీదేవికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. కళ్ల ముందే అమ్మ రక్తపు మడుగుల్లో విగతజీవిలా పడి ఉండటంతో ముగ్గురు చిన్నారులు ఏమైందో తెలియక రోదించడం స్థానికులు కలచివేసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top