కోర్టు గదిలో మహిళపై అత్యాచారం

Woman Physical Assault By Staffer At Rouse Avenue Court In Delhi - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూస్‌ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని గదిలో 38 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసిన బాధిత మహిళ.. తనపై అత్యాచారం జరిగినట్టుగా తెలిపారు. దీంతో వెంటనే కోర్టు గదికి చేరుకున్న పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ఘటన స్థలంలో ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బాధిత మహిళ నుంచి సమాచారం వచ్చిన వెంటనే తాము వేగంగా స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నట్టు ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. నిందితుడిని రాజేంద్ర సింగ్‌గా గుర్తించామని చెప్పారు. అతనిపై సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ఆ ఫలితాలు వచ్చాక నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

లేబర్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో సాయం చేస్తానని నమ్మించి నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత మహిళ ఆరోపించారు. నిందితుడు కోర్టులో పనిచేసే సిబ్బందిలో ఒకరని కూడా చెప్పారు. అయితే బాధితురాలు, నిందితుడు ఒకరిఒకరు ముందే తెలుసునని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు బాధితురాలు భర్తకు కూడా స్నేహితుడేనని పోలీసులు గుర్తించారు. (చదవండి : దుబాయ్‌లో భారతీయ దంపతుల హత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top