భార్య చేతిలో.. భర్త హతం | Wife Killed Husband in Rangareddy | Sakshi
Sakshi News home page

భార్య చేతిలో.. భర్త హతం

Sep 16 2019 11:23 AM | Updated on Sep 16 2019 11:23 AM

Wife Killed Husband in Rangareddy - Sakshi

హత్యకు గురైన విష్ణుమూర్తి , నిందితురాలు శారద

షాద్‌నగర్‌రూరల్‌: మద్యం సేవించి తరుచు గొడవ పడుతున్న భర్తను అతని భార్య దారుణంగా హతమార్చిన సంఘటన శనివారం అర్థరాత్రి ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. షాద్‌నగర్‌ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కందివనం గ్రామానికి చెందిన విష్ణుమూర్తి(30) వివాహం కొన్నేళ్ల క్రితం కొందుర్గు మండలం పీర్జాపూర్‌ గ్రామానికి చెందిన శారదతో జరిగింది. విష్ణుమూర్తి కందివనం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రిక్షా నడిపిస్తూ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అయితే విష్ణుమూర్తి తరుచుగా మద్యం సేవించి ఇంటికి రావడంతో పాటు భార్య,   పిల్లలతో నిత్యం గొడవపడేవారని తెలిపారు.

కళ్లలో కారంపొడి వేసి..
మద్యం సేవించి శనివారం అర్థరాత్రి ఇంటికి వచ్చి గొడవ పడుతున్న భర్త విష్ణుమూర్తి తీరుతో అప్పటికే విసుగు చెందిన అతని భార్య శారద.. విష్ణుమూర్తి కళ్లల్లో కారంపొడి చల్లించింది. దీంతో కింద పడిపోయిన విష్ణుమూర్తి తలపై బండరాయితో బలంగా బాది హతమార్చింది. ఈ విషయాన్ని ఇంటి చుట్టుపక్కల వారికి, బంధువులకు శారదనే స్వయంగా వెళ్లి చెప్పింది. రోజూ మద్యం తాగి తనను, తన పిల్లలను చిత్రహింసలు పెట్టడాన్ని భరించలేక ఈ పనిచేశానని భోరున విలపించింది.

నిందితురాలని చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు..
భర్తను హతమార్చిన శారదను గ్రామస్తులు ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు తాళ్లతో కట్టేశారు. ఎక్కడికైనా పారిపోతుందేమోనని ఆమెను చెట్టుకు కట్టేసినట్లు గ్రామస్తులు వివరించారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆదివారం ఉదయం సంఘటనా çస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement