22 ఏళ్ల తర్వాత అదే సీన్‌ రిపీట్‌, కానీ.. | Vikas Dube Shootout Case 22 Years Ago Assault On Police Team | Sakshi
Sakshi News home page

22 ఏళ్ల తర్వాత అదే సీన్‌ రిపీట్‌, కానీ..

Jul 20 2020 3:25 PM | Updated on Jul 20 2020 4:10 PM

Vikas Dube Shootout Case 22 Years Ago Assault On Police Team - Sakshi

లక్నో: కరుడుగట్టిన నేరస్తుడు, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన వికాస్‌ దుబే కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసు దళంపై వికాస్‌, అతని అనుచరులు ఈ నెల రెండో తేదీ రాత్రి కాల్పులకు దిగి పరారైన సంగతి తెలిసిందే. సరిగ్గా 22 ఏళ్ల క్రితం కూడా వికాస్‌ ఇదే తరహాలో తప్పించుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అప్పుడు వికాస్‌ బిక్రూ గ్రామానికి సర్పంచ్‌గా ఉన్నాడు. హత్యాయత్నం అభియోగాలపై వికాస్‌ను అరెస్టు చేసేందుకు వెల్లిన పోలీసులను అతని కుటుంబ సభ్యులు, అనుచరులు రోడ్డు తవ్వేసి అడ్డుకున్నారు.

మారణాయుధాలతో దాడికి దిగారు. అయితే, సంఖ్యా పరంగా కొద్దిమందే ఉండటంతో పోలీసులు వెనుదిరిగారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత జులై 2 వ తేదీ రాత్రి అలాంటి ఘటనే పునరావృతమైంది. కాకపోతే ఈసారి ఎనిమిది మంది పోలీసులు అమరులు కాగా, అదే వికాస్‌ చావుకు ముహూర్తం పెట్టింది. హత్యాయత్నం ఆరోపణలపై వికాస్‌ గ్యాంగ్‌ను అదుపులోకి పోలీసులు వెళ్లగా.. బుల్‌డోజర్లతో రోడ్డును ధ్వంసం చేసి అడ్డుకున్నారు. భవనంపైనుంచి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దాంతో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత పోలీసుల ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ హతమయ్యాడు.
(చదవండి: నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్‌రెడ్డి)

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అతను పట్టుబడగా.. పోలీసులు కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా వారి వాహనం బోల్తా పడింది. ఇదే అదనుగా వికాస్‌ తప్పించుకునే యత్నం చేశాడు. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో బుల్లెట్‌ గాయాలతో నేరగాడు మృత్యువాతపడ్డాడు. దుబే అనుచురుల్లో మరో ఐదురుగు కూడా పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. ఇదిలాఉండగా.. వికాస్‌ అనుచరుడు జయ్‌కాంత్‌ వాజ్‌పేయి, అతని మిత్రుడు ప్రశాంత్‌​ శుక్లాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
(దుబే ఎన్‌కౌంటర్‌ : తీవ్ర రక్తస్రావం, షాక్‌తో మృతి)

Advertisement
 
Advertisement
Advertisement