దంపతుల కలహాలకు చిన్నారులు బలి

Two Kids Deceased with Husbands and wives Fight - Sakshi

ఆదర్శ వివాహ బంధంలో గొడవల చిచ్చు.. 

పిల్లలకు పురుగుల మందు తాగించి.. తనూ తాగిన తల్లి 

ఇద్దరు చిన్నారులు మృతి.. తల్లి ఆరోగ్య పరిస్థితి విషమం

శామీర్‌పేట్‌: భార్యాభర్తల కలహానికి అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. భర్తతో గొడవపడిన భార్య తను పురుగుల మందు తాగి, చిన్నారులిద్దరికీ తాగించింది. ఈ ఘటనలో చిన్నారులు ప్రాణాలు విడిచారు. శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌ ప్రజయ్‌ హోమ్స్‌ లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు శామీర్‌పేట పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గోపీనాథ్, ప్రీతి దంపతులు తమ కుమారులైన గౌరవ్‌ (4), కౌషిక్‌ (2)తో కలిసి మజీద్‌పూర్‌ ప్రజయ్‌హోమ్స్‌ లో ఉంటున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి)

గోపీనాథ్‌ దంపతులు తరచూ గొడవపడుతుండేవారు. బుధవారం కూడా గొడవపడటంతో మనస్తాపానికి గురైన ప్రీతి.. ఉదయం భర్త గోపీ నాథ్‌ తను పనిచేసే ఫార్మా కంపెనీకి వెళ్లగానే, ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి, తనూ తాగింది. గోపీనాథ్‌ ఇంటికి వచ్చేసరికి ప్రీతి, ఇద్దరు చిన్నారులు ఇంట్లో పడి ఉన్నారు. వెంటనే వారి ని మేడ్చల్‌లోని లీలా హాస్పిటల్‌కు తరలించాడు. ఇద్దరు చిన్నారులు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి చిన్నారుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 

ఆదర్శ వివాహం.. రోజూ గొడవలే  
కర్నూలు జిల్లాకు చెందిన గోపీనాథ్‌.. ఆరేళ్ల క్రితం వరంగల్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ప్రీతి అనే అమ్మాయిని చూసి అనాథాశ్రమ నిర్వాహకులను ఒప్పించి, ఆమెను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అనాథ యువతిని పెళ్లాడిన ఆదర్శవంతుడిగా గుర్తింపు పొందాడు. ప్రజయ్‌హోమ్స్‌లో కాపురం పెట్టిన ఈ దంపతుల కాపురంలో పిల్లలు పుట్టిన అనంతరం గొడవలు ముదిరాయి. దీంతో విసుగెత్తిన ప్రీతి.. తాను పెరిగిన అనాథాశ్రమానికి వెళ్లి తన బాధ చెప్పుకునేదని తెలిసింది. మనస్పర్థలు పెరిగిన క్రమం లోనే మనస్తాపం చెందిన ప్రీతి పురుగుల మందు తాగి, తన ఇద్దరు పిల్లలకు తాగించిందని పోలీసులు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top