కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
నిజామాబాద్ : కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు..బోధన్ పట్టణంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్న దుర్గం వెంకట్-సావిత్రిలకు 15 రోజుల మగ శిశువు ఉన్నాడు. శిశువుతో కలిసి పట్టణంలోని హనుమాన్ మందిరం సమీపంలోని లక్ష్మీ జ్యూవెల్లరీ దుకాణం వద్ద శనివారం రాత్రి నిద్రిస్తుండగా ఇద్దరు యువకులు ఇలియాస్, చిరంజీవిలు 11 గంటల సమయంలో బాబును ఎత్తుకెళ్లారు.
గోశాల కాలనీకి చెందిన కౌసర్ బేగంకు రూ. 5 వేలకు విక్రయించారు. బాబును కొనుగోలు చేసిన కౌసర్ బేగం మహారాష్ట్రలోని దెగ్లూర్లో ఉంటున్న తన కూతురు గౌసియా బేగం వద్ద ఉంచింది. ఉదయం బాబు కనపడకపోవడంతో ఆందోళన చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టి, బాబును తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. కిడ్నాప్నకు పాల్పడిన ఇద్దరు యువకులతో పాటు శిశువును కొన్న మహిళపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.