వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి

TDP Leaders Attack On YSRCP Leaders Srikakulam - Sakshi

 ఇంటి పక్కన చెత్త  వేయొద్దన్నందుకు దౌర్జన్యం

లావేరు: మండలంలోని లావేటిపాలేంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త లుట్ట సురేష్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు శుక్రవారం రాత్రి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి కథనం మేరకు... గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త లుట్ట సురేష్‌ ఇంటి పక్కన స్థలంలో టీడీపీ వర్గానికి చెందిన ఎలగాడ సంధ్యారాణి, ఎలగాడ రమణమ్మ చెత్తా చెదారాలు వేశారు. ఇలా చెత్తా చెదారాలు వేయడం వల్ల దోమలు, ఈగలు బెడద ఎక్కువగా ఉంటుందని, చెత్తను తీసివేయాలని కోరాడు.

దీంతో ఆగ్రహం చెందిన టీడీపీ వర్గీయులు ఎలగాడ చిన్నారావు, సంధ్యారాణి, రమణమ్మ, చిట్టెమ్మలతోపాటు తాళ్లవలస గ్రామానికి చెందిన రేగాడ నాగరాజు సురేష్‌పై రాళ్లు, గాజు పెంకులతో దాడికి దిగారు. దీంతో సురేష్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు లావేరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో లావేరు పోలీసుల సూచన మేరకు శ్రీకాకుళం రిమ్స్‌కు 108 అంబులెన్సులో తరలించారు. ఈ మేరకు బాధితుడు రిమ్స్‌ అవుట్‌ పోస్టు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న లావేరు హెచ్‌సీ రమణ శనివారం ఉదయం లావేటిపాలేం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top