తల్లీ కూతురుపై ఇంటి యజమాని కీచక పర్వం

Residency Owner Molested Woman And Her Daughter In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంట్లో అద్దెకుంటున్న ఓ తల్లీ, కూతురికి మత్తు మందు ఇచ్చి ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ సందయ్య నగర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంటి యజమాని గంగాధర్‌ యాదవ్‌, మరో ఇద్దరు వ్యక్తులు మత్తు పదార్థం ఇచ్చి తల్లి (35), కూతురు (15)పై అత్యాచారానికి పాల్పడ్డారు. కూలి పని చేరుకొని జీవనం సాగించే వీరికి ఇంటి యజమాని నిన్న మధ్యాహ్నం మత్తు పదార్థం కలిపిన చికెన్‌ ఇచ్చాడు. అది తిన్న కొద్ది సేపటికి మహిళ, ఆమె కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. అనంతరం గంగాధర్‌, అతని ఇద్దరు స్నేహితులు  మైనర్‌ బాలిక, ఆమె తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

ఈ ఘటనలో ఇంటి యజమాని, అతని స్నేహితులకు మరో మహిళ సాయం చేసిందని స్థానికులు తెలిపారు. కూలీ పని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరి భర్తకు భార్య, కూతురు, కుమారుడు స్పృహలో లేకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతో స్థానికులకు, దాంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా, మత్తు మందు కలిసిన ఆహారం తినడంతో పిల్లలిద్దరూ రక్తపు వాంతులు చేసుకున్నారని స్థానికులు చెప్పారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని నిందితులు రూ.20 వేలకు బేరం మాట్లాడినట్టుగా బాధితులు తెలిపారు.
(లైంగిక వేధింపులు తాళలేక మైనర్‌ ఆత్మహత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top