మృగాళ్ల పాపం : 11 ఏళ్లకే తల్లిగా.. | Rape Survivor Discharged From Rajkot Hospital | Sakshi
Sakshi News home page

మృగాళ్ల పాపం : 11 ఏళ్లకే తల్లిగా..

Mar 24 2018 12:28 PM | Updated on Jul 28 2018 8:43 PM

Rape Survivor Discharged From Rajkot Hospital - Sakshi

రాజ్‌కోట్‌ : మహిళా దినోత్సవాలు, స్త్రీ సాధికారత మీద ఉపన్యాసాలు కేవలం అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి. ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పురాక నిర్భయలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న దారుణమే ఇందుకు ఉదాహరణ.

వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే ఇరుగుపొరుగు ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే, ఆ అమ్మాయి పనిచేస్తున్న ఇళ్లల్లోని ఓ ఆరుగురు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. గత 9 నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. అయితే, నిజం చెబితే తనను ఏదైనా చేస్తారేమో అనే భయంతో ఆ బాలిక ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. అయితే, క్రమంగా బాలిక ఆరోగ్యంలో మార్పులు రావడం గుర్తించిన ఆమె తల్లి మార్చి 8న ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే 8 నెలల గర్భవతి అని నిర్దారణ అయింది. ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఆమె తల్లి ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులో​కి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు 60 ఏళ్ల వృద్దులతోపాటు ఒక మైనర్‌ కూడా ఉన్నట్లు తెలిసింది.

తల్లి క్షేమం.. చావుబతుకుల్లో చిన్నారి

ఇదిలా ఉండగా, ఆ బాధిత బాలిక ఈ నెల 17న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలికను కాపాడటానికి సిజేరియన్‌ చేయాల్సి వచ్చిందని రాజ్‌కోట్‌ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు కమల్‌ గోస్వామి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి క్షేమంగా ఉందని, ఆమెను డిశ్చార్జ్‌ చేశామన్నారు. వెన్నెముక లోపం, పక్షవాతం రావడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఆమె బతకాలి.. కానీ మాకొద్దు
తమ బిడ్డ జన్మనిచ్చిన శిశువు బతకాలని కోరుకుంటున్నామని, అయితే, ఆ శిశువును మాత్రం తాము చేరదీయలేమని బాధితురాలి బంధువులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement