మరో షాక్‌... ప్రద్యుమన్‌ను అతనూ చంపలేదా? | Sakshi
Sakshi News home page

ప్రద్యుమన్‌ హత్యకేసులో మైనర్ సంచలన ఆరోపణలు

Published Tue, Nov 14 2017 12:15 PM

Prdyuman Case Minior Alleges on Police and CBI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారి ప్రద్యుమన్‌ హత్యకేసులో మరో మలుపు. హత్య చేశాడని అరెస్ట్ చేసిన మైనర్‌ హర్యానా పోలీసులు, సీబీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. బలవంతంగా తనతో నేరాన్ని ఒప్పించారని అతను చెబుతున్నాడు. 

హిందుస్థాన్‌ టైమ్స్‌.. ఇండియా టుడే కథనాల ప్రకారం... సీబీఐ అధికారి రేణు సాయిని సోమవారం బాలుడిని కలిసి రెండు గంటలు మాట్లాడారు. ఆ సంభాషణలో అతను వివరాలు వెల్లడించినట్లు ఆయా కథనాలు పేర్కొన్నాయి. సీబీఐ, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ అధికారి ఒత్తిడి మేరకే తాను చెయ్యని నేరాన్ని అంగీకరించినట్లు బాలుడు తెలిపాడు.  విచారణ పేరిట తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని..  బలవంతంగా తను నుంచి నేరాన్ని ఒప్పుకున్నట్లు స్టేట్‌మెంట్ రికార్డు చేయించారని వివరించాడు. సీబీఐ అధికారులు కూడా దూషిస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని చెప్పాడు. 

హత్య జరిగిన తీరును సీబీఐ విచారించటం.. తనను అరెస్ట్ చేసిన విధానం రెండూ వేర్వేరుగా ఉన్నాయని అతను వాదిస్తున్నాడు. తాను అమాయకుడినని.. అనవసరంగా తనను కేసులో ఇరికించారని తెలిపాడు. మరోవైపు అతని తల్లిదండ్రులు కూడా బాలుడి అరెస్ట్ తర్వాత ఇదే వాదనను వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి... ఆ కారణంతోనే చంపాడా?

అయితే సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన సీబీఐ మాత్రం మైనర్‌ పైనే అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తు ముందుకు వెళ్తుంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులూ చెబుతున్నారు. మరోవైపు నేరం తీవ్రత దృష్ట్యా నిందితుడిని మేజర్‌గా భావించాలంటూ ప్రద్యుమన్ తల్లిదండ్రులు కోర్టుకు విన్నవిస్తున్నారు. ఒకవేళ కోర్టు వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుంటే గరిష్ఠంగా మూడేళ్లు.. తీసుకుంటే మాత్రం అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. ఇదిలావుంటే ప్రద్యుమన్ కేసును విచారించిన పోలీసులు ర్యాన్ స్కూల్ బస్సు కండక్టర్‌  అశోక్‌ కుమార్‌ను ఇరికించాలని యత్నించటం.. దానిని ఉన్నతాధికారుల ముందు ఒప్పుకోవటం సంచలనం సృష్టించింది.

Advertisement
Advertisement