పాము కాటుతో భార్య మృతి.. భర్త అరెస్ట్‌

Police Arrested A man For Getting His Wife Killed By A Snake Bite In Kerala - Sakshi

తిరువనంతపురం : కేరళలోని ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పాము కాటుతో చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న సూరజ్‌ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం ఉత్తర అనే యువతితో వివాహం అయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరు కొల్లంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య ఆస్తి మీద కన్నేసిన సూరజ్‌.. గత ఐదు నెలలుగా ఆమెను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాములు పట్టడంలో నేర్పరి అయిన తన స్నేహితుడు సురేశ్‌ సాయం కోరాడు. అతని సాయంతో ఫిబ్రవరిలో ఒకసారి ఉత్తరను పాము కాటు వేసేలా చేశాడు.

అయితే సరైన సమయంలో చికిత్స అందడంతో ఉత్తర ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే మే తొలి వారంలో మరోసారి ఉత్తరను అంతమొందించాలని సురేశ్‌ నిర్ణయించుకున్నాడు. సురేశ్‌ వద్ద నుంచి పామును తీసుకుని.. మే 6వ తేదీ రాత్రి ఉత్తర బెడ్‌ రూమ్‌లో వదిలాడు. మరుసటి  రోజు తెల్లవారేసరికి ఆమె మరణించారు. ఆ రోజు రాత్రి ఇంట్లోనే ఉన్న సురేశ్‌.. తనకేం తెలియదనట్టు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్టుగా నిర్ధారించారు.

అయితే ఉత్తరను రెండుసార్లు పాము కాటు వేయడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె బంధువులు ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భార్య ఆస్తి కోసమే సూరజ్‌ పథకం ప్రకారం ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు సూరజ్‌ ఫోన్‌లో పాములకు సంబంధించిన వీడియోలు చూసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top