ఛాతీపై మూడు చోట్ల గాట్లు
ఆస్పత్రికి తరలింపు.. కొనసాగుతున్న చికిత్స.. భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
పార్వతీపురంరూరల్/జియ్యమ్మవలస రూరల్ : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ–రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పత్తిక అభి సోమవారం రాత్రి పాము కాటుకు గురయ్యాడు. ఛాతీపై మూడు చోట్ల గాట్లు కనిపించడం, అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది, భయాందోళనకు గురయ్యారు. విద్యార్థిని తొలుత రామభద్రపురం పీహెచ్సీకి, అనంతరం కురుపాం సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థికి విష విరుగుడు మొదటి డోసు ఇచ్చారు.
మరో ఎనిమిది గంటల తర్వాత రెండవ డోసు ఇస్తామని వైద్యులు తెలిపారు. విద్యార్థిని 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. కాగా, ఈ పాఠశాల హాస్టల్ పక్కనే అడవిని తలపించేలా చెట్లు పెరిగి.. పాములు, విష కీటకాలు తరచూ పాఠశాలలోకి ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


