గుట్టు విప్పిన మటన్‌సూప్‌!

New Twist in Nagar kurnool Sudhakar Reddy Murder Case - Sakshi

సుధాకర్‌రెడ్డి హత్య కేసులో రోజుకో కోణం 

శాఖాహారి అంటూ సూప్‌ తాగేందుకు రాజేశ్‌ నిరాకరణ 

అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుధాకర్‌ రెడ్డి తల్లిదండ్రులు  

తమదైన శైలిలో విచారణ.. ‘ఆధార్‌’తో విషయం వెల్లడి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్‌ కర్నూల్‌కు చెందిన కాంట్రాక్టర్‌ సుధాకర్‌రెడ్డి హత్య కేసులో రోజుకో కోణం వెలు గు చూస్తోంది. భర్త సుధాకర్‌ రెడ్డిని హత్య చేసి ప్రియుడు రాజేశ్‌ను ఆ స్థానంలో పెట్టాలని స్వాతి పన్నిన పథకం ఎలా బయట పడిందన్న విష యం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. మటన్‌సూప్‌ వల్లే ఈ కేసు గుట్టు రట్టయిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఏ అపోలో ఆస్పత్రిలో స్వాతి ప్రియుడు రాజేశ్‌ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా కాలిన గాయాలతో చికిత్స పొం దుతున్న వారికి ఆస్పత్రిలో మటన్‌ సూప్‌ ఇస్తుంటారు. చికిత్స పొందుతున్న రాజేశ్‌కు వైద్యులు మటన్‌సూప్‌ తాగించేందుకు యత్నించారు.

కానీ తాను శాఖాహారినని మటన్‌ సూప్‌ తాగేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న సుధాకర్‌ రెడ్డి తల్లిదండ్రులు కంగుతిన్నారు. వాస్తవంగా సుధాకర్‌రెడ్డికి మాంసాహారం ఇష్టం కాగా.. ఇప్పుడు వద్దన డం ఏమిటని వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడే వారికి అనుమానమొచ్చింది. చికిత్స పొందుతోంది సుధాకర్‌రెడ్డి కాదని, మరొకరన్న సంగతి క్రమంగా వారిలో బలపడుతూ వచ్చింది. రాజేశ్‌ ముఖానికి ఉన్న ముసుగు తొలగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే స్వాతి వారిని అడ్డుకునేదని, ‘ఆయన మాట్లాడలేకపోతున్నారని..ఏదైనా ఉంటే రాసి చూపిస్తాడం టూ’ పెన్ను, పేపర్‌ ఇచ్చి రాజేశ్‌తో సమాధానం ఇప్పించేది. ఇలా పదిరోజుల పాటు స్వాతి, రాజేశ్‌ తమ బండారం బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు  అనుమానం వ్యక్తం చేయడం.. రంగప్రవేశం చేసిన పోలీసులు గోప్యంగా ఆరా తీశారు. సుధాకర్‌ రెడ్డి ఆధార్‌ కార్డుకు రాజేశ్‌ వేలిముద్రలకు సరిపోలక పోవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.  

ఎంతైనా భరిస్తానన్న స్వాతి 
ముఖం కాలిన రాజేశ్‌కు ప్లాస్టిక్‌ సర్జరీ చేసి ఎవరూ గుర్తుపట్టకుండా తయారు చేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడనని ఆస్పత్రి వర్గాలతో స్వాతి అన్నట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్‌ సర్జరీ అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పినా.. సర్జరీ చేసేందుకు డబ్బు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని అన్నట్లుగా చెబుతున్నారు. రాజేశ్‌ ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి భర్తను చంపిన కేసు నుంచి బయటపడటంతోపాటు ప్రియుడితో కాపురం చేసేందుకు స్వాతి తీవ్ర ప్రయత్నాలు చేసింది. 

కొడుకు పుట్టిన రోజునే.. 
సుధాకర్‌రెడ్డి ఆరేళ్ల కుమారుడు దర్శిత్‌రెడ్డి ఏడో పుట్టిన రోజు నవంబర్‌ 27న జరగాల్సి ఉంది. అంతకు ముందురోజు సుధాకర్‌రెడ్డి కొడుకు పుట్టిన రోజు ఏర్పాట్లలో భాగంగా కొత్త బట్టలు కొన్నాడని స్నేహితులకు తెలిపారు. 27న ఉదయాన్నే సుధాకర్‌ రెడ్డిని హత్య చేశారు.  

పోలీసుల అదుపులో రాజేశ్‌! 
ప్రధాన నిందితుడైన రాజేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సోమ వారం అర్ధరాత్రే పోలీసులు అదుపులోకి తీసుకు న్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం రాజేశ్‌ను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.  

బకాయి బిల్లు చెల్లించేదెవరు? 
హైదరాబాద్‌: హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఏ అపోలో ఆస్పత్రిలో 18 రోజుల పాటు రాజేశ్‌కు జరిగిన చికిత్సకు యాజమాన్యం రూ.4 లక్షలు బిల్లు వేయగా.. ఇందులో సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు (తమ కుమారుడే అనుకొని) రూ.2.10 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.1.90 లక్షల బిల్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకా యి ఎవరు చెలిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ఓ వైపు హత్య, కుట్ర కేసుల్లో స్వాతి అరెస్టయి రిమాండ్‌కు వెళ్లగా... మరోవైపు రాజేశ్‌ కుటుంబసభ్యులెవరూ ఇప్పటి వరకు ముందుకు రాకపోవడంతో బిల్లు ఎవరు చెల్లిస్తారో తెలియక పరిస్థితి అయోమయంగా మారింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top