ఆ పిటిషన్‌ నేను పెట్టుకోలేదు: నిర్భయ కేసు దోషి

Never applied mercy plea  says Nirbhaya convict   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  2012లో  దేశ వ్యాప్తంగా ప్రకంపనలు  రేపిన నిర్భయ కేసులో నేరస్తుడు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు రాసిన లేఖలో సంచలన విషయం వెల్లడించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోలేదని ఢిల్లీలోని నిర్భయ సామూహిక హత్యాచార ఘటనలో మరణ శిక్ష పడిన వినయ్‌ శర్మ పేర్కొన్నాడు. ఆ పిటిషన్‌పై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తన మెర్సీ పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని తన న్యాయవాది ఏపీ సింగ్‌ ద్వారా అభ్యర్థించాడు. అంతేకాదు హోం మంత్రిత్వ శాఖ పంపించిన క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం తనది కాదని స్పష్టం చేశాడు. తను ఇంకా ఎలాంటి క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయకముందే ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు.

కాగా వినయ్‌ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా, దీన్ని రాష్ట్రపతికి పంపిన హోంశాఖకు పంపించిన సంగతి తెలిసిందే. ఈకేసులో వినయ్ శర్మ సహా మొత్తం దోషులుగా తేలినవారు ఆరుగురు. వీరిలో రామ్‌సింగ్‌ 2013 మార్చిలో జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా మరొక నిందితుడు మైనర్ కావడంతో అతడికి బాలనేరస్తుల కోర్టు మూడేళ్ళ శిక్ష విధించి అనంతరం విడుదల చేసింది. ఇక మిగిలిన నలుగురు నిందితులు పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, ముఖేశ్‌ సింగ్‌, వినయ్‌ శర్మలకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వినయ్‌ శర్మ చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top