బాంద్రా ఘటన: అతడికి బెయిల్‌ | Sakshi
Sakshi News home page

వినయ్‌ దూబేకు బెయిల్‌

Published Tue, Apr 28 2020 8:47 PM

Mumbai Local Court Grants Bail to Bandra Incident Accused - Sakshi

ముంబై: బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద వలస కార్మికుల ఆందోళనకు కారణమైన వినయ్‌ దూబేకు బెయిల్‌ లభించింది. బాంద్రా కోర్టు మంగళవారం అతడికి రూ. 15వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. వలస కార్మికులను రెచ్చగొట్టి బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద అలజడికి కారణమయ్యాడని వినయ్‌ దూబే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లాక్‌డౌన్‌ ఎత్తేస్తున్నారన్న ప్రచారంతో ఈనెల 14న భారీ సంఖ్యలో వలస కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే వారందరూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠిచార్జి చేసి వారిని చెదరగొట్టారు.

తాము తిరిగి వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించకపోతే కాలినడకన భారీ ర్యాలీగా ఉత్తర భారత్‌కు బయలుదేరేందుకు సిద్ధపడాలంటూ సోషల్‌ మీడియాలో వినయ్‌ దూబే ప్రచారం చేయడం వల్లే అమాయక కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారని తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్‌ చేసి ఐపీసీ 117, 153ఏ, 188, 269, 270, 505(2), సెక్షన్‌ 3 కింద కేసులు నమోదు చేశారు. అతడికి విధించిన పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. కాగా, వలసకూలీలను స్వస్థలాలకు పంపబోమని, వారి బాగోగులను ప్రభుత్వం చూసుకుంటుందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ముంబై అలజడి; వినయ్‌ దూబే అరెస్ట్‌

Advertisement
Advertisement