భర్తను హతమార్చి నెల రోజులుగా కిచెన్‌లో దాచి.. | MP Woman Kills Husband Buries Him Under Kitchen Slab | Sakshi
Sakshi News home page

అనైతిక బంధం : భర్తను హతమార్చి కిచెన్‌లో దాచి..

Nov 22 2019 4:07 PM | Updated on Nov 22 2019 5:56 PM

MP Woman Kills Husband Buries Him Under Kitchen Slab - Sakshi

పరాయి మహిళతో భర్త అనైతిక బంధంపై ఆగ్రహంతో రగిలిపోయిన భార్య కట్టుకున్న భర్తను మట్టుపెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

భోపాల్‌ : వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే ఆగ్రహంతో భర్తను మట్టుబెట్టి నెలరోజుల పాటు కిచెన్‌లో దాచిన భార్య ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అనుపూర్‌ జిల్లాలోని కరోండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్‌ 22న తన భర్త మహేష్‌ బనవల్‌ (35) కనిపించడం లేదని భార్య ప్రమీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెలరోజుల పాటు మహేష్‌ ఆచూకీ లభించకపోవడంతో ఆయన సోదరుడు అర్జున్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈనెల 21న ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తన సోదరుడికి ఏమి జరిగిందో తెలుసుకునేందుకు వారి ఇంటికి వెళ్లిన ప్రతిసారి తమ వదిన మహేష్‌ను తాము పొట్టన పెట్టుకున్నామని తమను ఇంటిలోకి రానివ్వకుండా నిందలు మోపుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రమీల ఇంటికి వెళ్లగా అక్కడ నుంచి దుర్వాసన రావడంతో కిచెన్‌లో కుళ్లిన స్ధితిలో మహేష్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నెలరోజులుగా భర్త మృతదేహాన్ని కిచెన్‌ శ్లాబ్‌పై ఉంచి ప్రమీల అక్కడే వంట చేసుకోవడం అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. తన భర్త మహేష్‌ తన బావ భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో బావ సహకారంతో తాను ఈ హత్యకు పాల్పడ్డానని ప్రమీల నేరం అంగీకరించారు. మహేష్‌, ప్రమీల దంపతులకు నలుగురు కుమార్తెలు ఉండటం గమనార్హం. తండ్రి హత్యకు గురికావడం, తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో నలుగురు కుమార్తెలు దిక్కులేని వారయ్యారని బంధువులు, స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement