ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
బెంగళూరులో విషాదం
కర్ణాటక, బనశంకరి : చిన్నపాటి కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హెబ్బాల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... మనోరాయనపాళ్యకు చెందిన పుష్పవతి (30)తో ఎంబెసీ గ్రూప్ కంపెనీలో కారుడ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న నాగరాజ్ను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అనంతరం దంపతులు ఇక్కడి మనోరాయనపాళ్యలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. వీరికి ఎనిమిదేళ్లు వయసు గల జీవన్, ఐదునెలల ఆడపిల్ల సంతానం. కుటుంబ విషయంలో దంపతులిద్దరూ అప్పుడప్పుడు గొడవపడేవారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో భర్త విధులకు వెళ్లిన సమయంలో మూడవ తరగతి చదువుతున్న జీవన్, ఐదునెలల పసికందుకు విషం కలిపిన భోజనం తినిపించి హత్య చేసింది. అనంతరం పుష్పవతి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు జీవితంపై విరక్తితో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డానని తన చావు కు నేనే కారణమని అని లేఖ రాసింది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న నాగరాజ్ ఇంటి తలుపు పలుమార్లు తట్టిన స్పందన రాకపోవడంతో భయపడి తలుపులు బద్దలు కొట్టిచూడగా ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరించారు.