హత్య చేసి.. గోడ మీద రాసి వెళ్లాడు
గాంధీనగర్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడమే కాక అందుకు గల కారణాన్ని గోడ మీద రాసి మరీ వెళ్లాడో వ్యక్తి. వివరాలు.. గుజరాత్ బనస్కాంత జిల్లా కుడా గ్రామానికి చెందిన ఉకభాయ్ పటేల్ స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద రూ. 21 లక్షలు అప్పు చేశాడు. తిరగి చెల్లించలేక పోయాడు. దాంతో సదరు వడ్డీ వ్యాపారి గురువారం రాత్రి ఉకభాయ్ ఇంటికి వచ్చి పదునైన ఆయుధంతో ఉకభాయ్తో పాటు అతని భార్య, కుమార్తె, కొడుకుల గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
అంతేకాక తన అప్పు చెల్లించనందువల్లే ఉకభాయ్ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు గోడ మీద రాసి మరీ వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఉకభాయ్ కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.