బాలికపై గ్యాంగ్‌ రేప్‌ | Molestation on girl | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Jun 23 2019 4:38 AM | Updated on Jun 23 2019 6:30 PM

Molestation on girl - Sakshi

ఒంగోలు: ఇల్లొదిలి వచ్చిన ఓ బాలికను ట్రాప్‌ చేశాడో యువకుడు. మాయమాటలు చెప్పి ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు. అతడితోపాటు మరో ఐదుగురు యువకులు ఆమెపై నాలుగు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం అనుమానాస్పద స్థితిలో కనిపించిన బాలికను ఒంగోలు పోలీసులు గుర్తించి.. ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరానికి చెందిన ఓ బాలిక తన తాతకు అనారోగ్యంగా ఉండటంతో అతనికి సాయంగా అక్కడి ఆస్పత్రిలో ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రాము అనే టాక్సీ డ్రైవర్‌ అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తిని అదే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంలో ఆ డ్రైవర్‌ బాలికతో మాట లు కలిపాడు.

ఆ పరిచయంతో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం తల్లికి తెలియడంతో కూతుర్ని ఇటీవల మందలిం చింది. దీంతో ఆగ్రహించిన బాలిక ఇల్లు వదిలిపెట్టి ఒంగోలుకు పయనమైంది. బస్టాండ్‌కు చేరుకుని టాక్సీ డ్రైవర్‌ కోసం వాకబు చేసింది. బస్టాండ్‌లోని ఒక చిరు దుకాణంలో పనిచేసే యువకుడు ఇదంతా గమనించాడు. ఆ బాలికతో మాటలు కలిపాడు. ఆమె సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ అయిపోవడంతో ఆ యువకుడి షాపులోనే చార్జింగ్‌ పెట్టుకుంది. ఈ క్రమంలో అతను బాలికకు మాయ మాటలు చెప్పాడు. టాక్సీ డ్రైవర్‌ ఆచూకీ లభించేంత వరకు తాను ఆశ్రయం కల్పిస్తానని నమ్మించడంతో అతని వెంట నడిచింది.

నగరంలోని రద్దీ ప్రాంతంలో గల ఒక రూమ్‌కు బాలికను తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు మరో ఐదుగుర్ని ఆమెపై వరుస లైంగిక దాడులకు పురిగొల్పాడు.  చివరకు శనివారం ఒంగోలు బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీసులు విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు.  నిందితులలో ఇరువురు ఇంటర్మీడియెట్‌ చదివిన యువకులు ఉన్నట్టు తెలుస్తుండగా.. మరో నలుగురు యువకులు ఇంజనీరింగ్‌ విద్యార్థులని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ ఇప్పటికే తమ సిబ్బందిని రంగంలోకి దించామని, ఆరుగురు నిందితులను గుర్తించామన్నారు.ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement