
సంధ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ కుమారస్వామి
రాంబిల్లి(యలమంచిలి): మండలంలోని లోవపాలెం సమీప జీడితోటలో ఉరివేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సముద్ర స్నానానికని చెప్పి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడింది. ఇష్టంలోని పెళ్లి చేయడమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఎస్ఐ కె. కుమారస్వామి, లోవపాలెం గ్రామస్తుల కథనం ప్రకారం.. లోవపాలేనికి చెందిన సంధ్యకు రేవుపోలవరానికి చెందిన చింతకాయల జగ్గారావుతో ఆరునెలల క్రితం వివాహమైంది. అప్పట్లో సంధ్య తనకు ఆ పెళ్లి వద్దని నిరాకరించినా పెద్దలు బలవంతంగా పెళ్లి చేసి కాపురానికి పంపించారు. అయితే కొన్ని రోజులుగా సంధ్య లోవపాలెంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.
పది రోజుల నుంచి భర్త వద్ద వెళ్లమంటూ ఆమె తల్లి ఒత్తిడి తెస్తున్నా సంధ్య అందుకు అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సముద్ర స్నానానికి అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఎంతకూ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం సముద్ర తీరంలోని జీడితోటలో సంధ్య మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ కుమారస్వామి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సంధ్య మృత దేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు సహా పలువురిని విచారించారు. తహసీల్దార్ ఎస్.ఎ. మహేశ్వరరావు పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంధ్య మృతితో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.