గంజాయి విలువ రూ.1.10కోట్లు | Marijuana gang arrest Two Lorries Siege | Sakshi
Sakshi News home page

గంజాయి విలువ రూ.1.10కోట్లు

Apr 14 2018 11:35 AM | Updated on Apr 14 2018 11:35 AM

Marijuana gang arrest Two Lorries Siege - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌

ఖమ్మంక్రైం: ఒడిశా రాష్ట్ర సరిహద్దులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి గంజాయితో వెళ్తున్న రెండు లారీలను ఖమ్మం టాస్క్‌ఫోర్స్, పోలీసులు గురువారం పట్టుకున్న విష యం విదితమే. శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ వివరాలను వెల్లడించారు. 

ఒడిశా రాష్ట్ర సరిహద్దుల నుంచి ఖమ్మం మీదుగా రాజస్థాన్‌కు అక్రమంగా గంజా యి రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకున్న ఖమ్మంరూరల్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వరంగల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద నిఘా ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక లారీలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని ఆపి తనిఖీ చేస్తుండగానే పైలెట్‌గా వెళ్తున్న మరో వాహనంలో ముగ్గురు నిందితులు పారిపోయారు. తనిఖీ చేసిన లారీపై భాగంలో పోలీసులు ఎక్కి చూడగా.. బస్తాలలో గంజాయిని తరలిస్తున్నట్లు బయట పడింది. లారీలో ఉన్న మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన గుగులోతు వెంకన్న, రాజస్థాన్‌ లోని నాగోర్‌ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ ప్రేమ్, క్లీనర్‌ అశోక్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఒడిశా రాష్ట్ర సరిహద్దుల నుంచి ఈ గంజాయిని రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. 460 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.46 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి బొగ్గు లారీలో అనుమానం రాకుండా భారీ ఎత్తున గం జాయిని తరలిస్తున్నట్లు ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వీఎం బంజర పోలీసులకు సమాచారం అందడంతో వారు లారీని ఆపి సోదాలు చేశారు.

ఈ లారీలో పైన, కింద బొగ్గు వేసి ఉండగా అనుమానం రాకుండా మధ్యలో గంజాయి బస్తాలను పెట్టారు. పోలీసులు 31 గంజాయి బస్తాలను బయటకు తీసి చూడగా 646 కేజీలు ఉంటాయని, వీటి విలువ రూ.64,60 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. ఈ గంజాయిని విశాఖపట్నం జిల్లా నర్సిపట్నానికి చెందిన దేశపతి నాయుడు కర్ణాటకకు చెందిన శివాజి, విశ్వనాథ్‌లతో ఒప్పందం చేసుకున్న ప్రకారం ముంబ యి తరలిస్తున్నామని పట్టుపడిన లక్ష్మణ్‌ రాథోడ్, జాఫర్‌లు తెలిపారు. వీరు మొదట లారీని హైదరాబాద్‌ తీసుకెళ్లి అక్కడి గంజాయిని అన్‌లోడ్‌ చేసి అక్కడికి వచ్చే దేశపతినాయుడు, శివాజి, విశ్వనాథ్‌లు గంజాయిని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. వీరి వద్ద 2 సెల్‌ఫోన్‌లను స్వాధీన పరచుకున్నట్లు,  రెండు లారీలను సీజ్‌ చేసి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. రూరల్‌ ప్రాంతంలో పైలెట్‌ వాహనంలో పారిపోయిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారని, అరెస్టయిన వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని తెలిపారు.  ఇంత భారీస్థాయిలో గంజాయి పట్టుపడటానికి కారణమైన ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రెహమాన్, రూరల్‌ ఏసీపీ నరేష్‌రెడ్డి, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, ఇతర సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్‌ డీసీపీ సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement