పెళ్లి రోజున భార్య ఇంటికి రాలేదని..

Man Suicide his Wedding Anniversary Day - Sakshi

యువకుడి ఆత్మహత్య

బంజారాహిల్స్‌: పెళ్లి రోజున భార్య తనతో రాకుండా పుట్టింట్లోనే ఉండటమే కాకుండా కుటుంబసభ్యులతో తిట్టించిందని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్, గౌతంనగర్‌లో ఉంటున్న రాపాన రాము(26) కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి 2013లో సురేఖతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. 20 రోజుల క్రితం హఫీజ్‌పేట్‌లోని పుట్టింటికి వెళ్లిన సురేఖ ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి రాలేదు. దీనికితోడు ఆమె తల్లిదండ్రులు భీమమ్మ, వెంకయ్య, సోదరుడు చిన్న ఆమెకు మద్దతుగా మాట్లాడారు.

గత శుక్రవారం పెళ్లి రోజు కావడంతో ఇంటికి వస్తే పిల్లలతో కలిసి గుడికి వెళ్దామని రాము భార్యను బతిమిలాడాడు. అయితే బామ్మర్ది చిన్న అందుకు అంగీకరించకపోగా అసభ్యంగా దూషించాడు. ఆదివారం కూడా అత్తవారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. అత్త, బావమరిది అతడిని తిట్టి పంపించారు. సోమవారం ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పుకుని బాధపడిన రాము మంగళవారం రాత్రి భోజనం చేయకుండానే గదిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు ఉదయం నిద్ర లేచి చూడగా  ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. తన చావుకు అత్త భీమమ్మ, మామ వెంకయ్య, బామ్మర్ది చిన్న కారణమని వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top