లారీనుంచి డ్రమ్ములు నూతన వధూవరులపై పడడంతో.. | Man Died In Road Accident Kurnool | Sakshi
Sakshi News home page

లారీనుంచి డ్రమ్ములు నూతన వధూవరులపై పడడంతో..

Jun 30 2019 7:31 AM | Updated on Jun 30 2019 7:32 AM

Man Died In Road Accident Kurnool - Sakshi

సాక్షి, మహానంది(కర్నూలు) : వారిద్దరికీ కొత్తగా పెళ్లి అయింది. పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు బంధుమిత్రులతో కలిసి మహానందికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నంద్యాల–గిద్దలూరు ఘాట్‌రోడ్డులో లారీపైన ఉన్న డ్రమ్ములు నూతన వధూవరుల బైక్‌పై పడ్డాయి. దీంతో బైక్‌ నడుపుతున్న శిరిగిరి శ్రీనివాసులు(32) తీవ్రంగా గాయపడి కోలుకోలేక మృతి చెందాడు. అలాగే ఆయన భార్య లక్ష్మీశిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా  గిద్దలూరుకు చెందిన శిరిగిరి శ్రీనివాసులు మెడికల్‌ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మీశిరీషతో ఈ నెల 16న వివాహం జరిగింది. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బైక్‌లపై లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, మరదలు బిందు, బంధువులు శ్రీను, సుబ్బయ్య, వెంకట్‌లతో కలిసి ఉదయం మహానందికి వచ్చారు.

మహానందీశ్వరుడిని దర్శించుకుని మూడు బైక్‌లలో వచ్చిన వీరు బయలు దేశారు. ముందు బైక్‌లో నూతన దంపతులు ఉన్నారు. అయితే పచ్చర్ల దాటిన తర్వాత గిద్దలూరు వైపు నుంచి ట్రైలర్‌ వాహనం వస్తుండగా.. గాజులపల్లె వైపు నుంచి వెళ్తున్న డీసీఎం లారీ ఢీకొట్టింది. దీంతో డీసీఎం లారీ కింద పడగా అందులో ఉన్న ఆయిల్‌ డ్రమ్ములు నూతన దంపతులు వెళ్తున్న బైక్‌పై పడ్డాయి. దీంతో వారు ఇద్దరూ తీవ్రగాయాలపాలయ్యారు. శ్రీనివాసులు మోచేయి విరగడంతో పాటు ఛాతీ, ఉదరభాగాన తీవ్రంగా గాయమైంది. వెంటనే లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, ఇతరులు గుంటూరువైపు వెళ్తున్న కారును ఆపి గాజులపల్లెకు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స  పొందుతూ  కోలుకోలేక శ్రీనివాసులు మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు లక్ష్మీశిరీషను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. నడుముల దగ్గర తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement