రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం | Man Died Road Accident In Denduluru Mandal | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం

Jan 13 2020 9:51 AM | Updated on Jan 13 2020 9:51 AM

Man Died Road Accident In Denduluru Mandal - Sakshi

భార్య, పిల్లలతో మృతుడు ప్రతాప్‌ కుమార్‌

సాక్షి, ద్వారకాతిరుమల: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కులాలు, మతాలు ఒక్కటే అయినా  వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఈ మధ్యే పెద్దలు సైతం వారిని చేరదీశారు. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన పెద్దింటి ప్రతాప్‌ కుమార్‌(27) అదే గ్రామానికి చెందిన గాయత్రిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాగవెంకట త్రినాథ్, హరీష్‌ నాయుడు సంతానం.

ప్రతాప్‌ కుమార్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ సందర్భంగా మృతుడు శనివారం ఏలూరుకు వెళ్లి తన ఇద్దరు పిల్లలకు దుస్తులు కొన్నాడు. అనంతరం తన స్నేహితుడు కందాడై లక్ష్మీకాంత్‌తో కలసి ద్విచక్ర వాహనంపై రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. ఘటనా స్థలమైన దెందులూరు మండలం సింగవరంలోని తిరుమల డెయిరీ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బైక్, వీరి బైక్‌ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రతాప్‌ కుమార్‌ తీవ్ర గాయాలుపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రతాప్‌ కుమార్‌ అకస్మాత్తుగా ప్రమాదానికి గురై మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement