విచారణకు ఆదేశించిన మంత్రి కొండా సురేఖ
రామాయంపేట, హవేళి ఘణపూర్ (మెదక్)/హైదరాబాద్: మెదక్ జిల్లా రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలోని హవేళి ఘణపూర్ మండలం గంగాపూర్వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ అధికారి జోజి, మెదక్, రామాయంపేట రేంజ్ అధికారులు విద్యాసాగర్, రమేశ్, ఇతర అధికారులు సంఘటనాస్థలిని సందర్శించారు. చిరుతను ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు డీఎఫ్వో తెలిపారు.
కాగా, రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందడంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శాస్త్రీయ ఆధారాలతో పూర్తి స్థాయిలో నివేదిక సమరి్పంచాలని మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాల పరిధిలో ఉన్న కేంద్ర, రాష్ట్ర రహదారులపై వన్యప్రాణుల సంచరించే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు వైల్డ్లైఫ్ క్రాసింగుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంత పరిధిలో వాహన చోదకులు నిరీ్ణత వేగంతో వెళ్లాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.


