విషాదం

Man Died in Hyderabad While Flying Kites - Sakshi

పతంగి ఎగురవేస్తూ.. జారిపడి యువకుడి మృతి

ఆరునెలల క్రితమే వివాహం

వారాసిగూడలో ఘటన

బౌద్ధనగర్‌: గాలి పటం ఎగుర వేస్తూ ఓ యువకుడు భవనంపై నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన చిలకలగూడ పొలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారాసిగూడకు చెందిన సయ్యద్‌ ఖలీద్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ (27) స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సంక్రాంతి పండగ కావడంతో తోటి స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం ఇంటి మిద్దె పైన గాలి పటాలు ఎగురవేస్తున్నారు.

ఈ సమయంలో ఆనందంలో ఉన్న ఖలీద్‌ భవనంపై ఉన్న విషయం మర్చిపోయి అడుగు ముందుకు వేయడంతో... ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్నేహితులు, స్థానికులు 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 6 గంటల సమయంలో ఖలీద్‌ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆరు నెలల క్రితమే వివాహం...
ఖలీద్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ (27)కు ఆరు నెలల క్రితమే వివాహం అయింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందరితో ఆప్యాయంగా ఉండే ఇమ్రాన్‌ మృతి స్థానికులను కలచివేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top